జనసేన పోరాట యాత్రలో భాగంగా మంగళవారం నాడు తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంలో ప్రసంగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ వాగ్బాణాలతో అధికార, ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ముఖ్యంగా జనసేనకు మంచి పట్టు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, టీడీపీకి అధికారం కట్ట బెడితే వాళ్లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయారని ఎద్దెవా చేశారు.
ఈ సందర్భంగా ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ నాయుడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. "తెలుగుదేశం నాయకులు ఎంత దిగజారిపోయారంటే, టెక్నాలజీని వాడుకుని నేను అన్న మాటల్ని వక్రీకరించి నన్ను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబుకి, లోకేష్కి ఒకటే చెబుతున్నా, ఈ చిల్లర వేషాలు మానేయండి చాలా నీచంగా ఉన్నాయి.
ఎందుకు చెప్తున్నా అంటే - టెక్నాలజీని వాడటం మొదలు పెడితే మీకంటే బాగా వాడతా. మీకు తెలుసో? లేదో? లోకేష్ బాబూ! నేను నటుణ్ణి మాత్రమే కాదు, ఫిల్మ్ డైరెక్టర్ ని, స్క్రీన్ ప్లే రైటర్ ని, టెక్నాలజీని బాగా అవగాహన చేసుకునే వ్యక్తిని కూడా. మీరు ఈ మార్ఫింగ్లు, వాయిస్లు మార్చడాలు చాలా చేస్తున్నారు. ఇలాంటివి చేయాలను కుంటే నేనూ మీకంటే బాగా చేయగలను. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర వేషాలు మీరు ఆపేయాలని మనవి చేస్తున్నా" అన్నారు పవన్ కళ్యాణ్.