ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన సంచలనం రేపిన “ఓటుకు నోటు కేసు” లో ఇంతవరకు ప్రపంచానికి తెలియని ముఖ్యవిషయాన్ని నేడు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్య మంత్రి కలవకుంట్ల చంద్రశేక్షర రావు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రచారంలో లేని కొత్త విష యాన్ని ప్రస్తావించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర ఉందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి, డబ్బులు ఎరవేయడం - ఏసీబీ అధికారులు బయట పెట్టిన ఒక వీడియోలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఉన్న ‘ఫోన్ కాల్ రికార్డు’ బయటి కొచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా చిక్కుల్లో పడ్డారు.
వాస్తవానికి అప్పట్లో నారా చంద్రబాబు నాయుణ్ణి అరెస్టు చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని అయితే, నాడు చంద్రబాబుతో మోడీకి ఉన్న సన్నిహిత సంభందాల వలన “బ్రీఫ్డ్ మె టైటిల్ తో ప్రచారం పొందిన ఆడియో టేప్” ను బయటకు తేకుండా “ఫోన్ ట్యాపింగ్ కేసు” ను తెరపైకి తీసుకురావడంతో అరెస్టు నిలిచి పోయిందని విశ్లేషకులు చెబుతుంటారు.
తాజాగా మహబూబ్ నగర్ లో టీఆర్ ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఓటుకు నోటు కేసులో ప్రధాని మోదీ హస్తం కూడా ఉందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే చంద్రబాబుతో చేతులు కలిపి నరేంద్ర మోదీ ఈ కుట్ర పన్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని అప్పట్లో వారు ప్రణాళికలు రచించారని ఆరోపణలు గుప్పించారు.
ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరుగుతున్న కుట్రపై ‘ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ’ తనకు తొలుత సమాచారమిచ్చారని కేసీఆర్ తెలిపారు. అనంతరం ‘ఏసీపీ పక్కా ప్రణాళిక’ తో మోదీ-బాబు కుట్రను భగ్నం చేసిందని వెల్లడించారు. రేవంత్ రెడ్డిని అధికారులు ‘రెడ్ హ్యాండెడ్’ గా పట్టుకున్న సంగతిని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో గతంలో ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీ పేరును కేసీఆర్ ప్రస్తావించకపోవడం గమనార్హం.