ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువు అయ్యారు. ఎలాంటి బెరుకు లేకుండా ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ అధికారులకే కాదు..సొంత పార్టీ నేతలకు కూడా తలనొప్పిగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ప్రీతిపాత్రుడైన యోగి ఆదిత్యనాథ్ ఆయన ఆశిస్సులు ఉండటం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా హనుమంతుడు దళిత గిరిజనుడు అంటూ వ్యాఖ్యలు చేసిన యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రాజస్థాన్ సర్వ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా లీగల్ నోటీసు పంపించారు.
మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, రాజస్తాన్లోని ఆల్వార్ జిల్లా మాలాఖేడాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు. ప్రజలంతా రామభక్తులకే ఓటేయాలి. రావణులకు కాదు’ అని అన్నారు.
హనుమాన్లాగానే మనం కూడా ఆ ఆశయం సిద్ధించే వరకు విశ్రమించరాదని, రామభక్తులంతా బీజేపీకి ఓటేస్తారని యోగి వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలని దెబ్బతీస్తూ హనుమంతుడిని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ఏమిటని సురేష్ ప్రశ్నించారు. అందుకే యోగికి రాజస్తాన్ సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా నోటీసులు పంపారు.