ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోవడం..హోటల్ నుంచి అకస్మాత్తుగా మాయం కావడం ఇలా ఎన్నో డ్రామాలు నడిచాయి. బిహార్ మాజీ ముఖ్యమంత్రి డగోరా ప్రసాద్ రాయ్ మనమరాలు, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె అయిన ఐశ్వర్య రాయ్ని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.
తాను భార్యతో అడ్జస్ట్ కాలేకపోతున్నానని, విడాకులు కావాలంటూ ఈ నెల తొలి వారంలో తేజ్ ప్రతాప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంలో తన కుటుంబ సభ్యులు తనకు మద్దతు ఇవ్వడం లేదని అలిగి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటి ముఖం చూడని తేజ్ ప్రతాప్, వారణాసి, హరిద్వార్ లో ఉన్నారు. తాజాగా తన భార్య ఐశ్వర్యా రాయ్ కు విడాకులు ఇవ్వాలన్న ఆలోచనన విరమించుకున్నారు. పాట్నా ఫ్యామిలీ కోర్టులో ఇటీవల దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ను ఈరోజు ఉపసంహరించుకున్నారు.
ఈ సందర్భంగా ఓ కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఒకసారి ప్రేమ ముక్కలైతే అది అతుక్కోదు. దాన్ని మళ్లీ కలపాలని ప్రయత్నించడం వృధా’ అనే భావం వచ్చేలా ఉన్న కవితను పోస్ట్ చేశారు. కాగా, అయితే 2019 ఎన్నికల నేపథ్యంలోనే తేజ్ ప్రతాప్ తన విడాకుల విషయంలో వెనక్కు తగ్గినట్లు సమాచారం. రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోడం కోసం ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో విడాకుల ఎపిసోడ్ పెద్ద ఎఫెక్ట్ కావొచ్చాని అందరూ భావించిన నేపథ్యంలో తేజ్ ప్రతాప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది.