అధికార తెలుగుదేశం పార్టీకి షాకులు తప్పవా. ఓ వైపు తెలంగాణాలో ప్రజా కూటమి విజయంలో తమ విజయం చూసుకుందామని తపన పడుతున్న పసుపు పార్టీ నేతలకు షాకులు ఇచ్చేందుకు ఏపీ తమ్ముళ్ళు సిధ్ధంగా ఉన్నారు. పార్టీలోని అసంత్రుప్తివాదులు జంప్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి మటుకు వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో ఏపీలో డిసెంబర్ నెల టీడీపీకి చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.
రావెల గుడ్ బై :
మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు టీడీపీకి రాజీనామా చేస్తారన్న న్యూస్ ఇపుడు బాగా వైరల్ అవుతోంది. ఆయన రేపు (డిసెంబర్ 1)న మంచి ముహూర్తం చూసుకుని టీడీపీకి గుడ్ బై కొడతారని అంటున్నారు. 2014 లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి సడన్ గా టిక్కెట్ దక్కించుకున్న మాజీ రైల్వే అధికారి రావెల కిషోర్ బాబు క్యాబినెట్ విస్తరణ లో ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవి దక్కించుకున్నారు.
అయితే గత ఏడాది ఫిబ్రవరి లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించారు. అప్పటి నుండి రావెల కిషోర్ బాబు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారు. అప్పటి నుండి పార్టీ మారాలని చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయట.
జనసేనలోకి :
రావెల మొదట జగన్ వైపు చూశారు. అయితే వైసిపి లో సీటు పై హామీ లభించలేదని తెలుస్తోంది. దీంతో..రెండు సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాన్ తో సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ నుండి వచ్చిన హామీ మేరకు జనసేన లో చేరాలని రావెల కిషోర్ బాబు డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1న ఆయన టిడిపికి రాజీనామా చేసి..జనసేనలో చేరుతారని విశ్వసనీయ సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రావెల మరో 24 గంటల్లో అధికార పార్టీకు భారీ షాక్ ఇస్తారని అంటున్నారు. ఇక ఇదే గుంటూరు జిల్లాలో మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యె ఒకరు కూడా సైకిల్ దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.