భారత దేశ వ్యాప్తంగా తన యోగాసనాలతో అందరి మనసు గెల్చుకున్నారు యోగా గురువు రాందేవ్ బాబా. అప్పుడప్పుడు వివాదాలకు కేంద్ర బింధువుగా నిలుస్తున్న ఈయకు తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాందేవ్ జీవితానికి సంబంధించిన బుక్ అమ్మకాన్ని, ప్రింటింగ్ ను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో రెస్పాండెంట్ 1 (రాందేవ్)కు నోటీసులు పంపినట్లు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్త నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. అసలు విషయానికి వస్తే..జుగ్గర్నౌట్ బుక్స్ అనే పబ్లిషర్ ‘గాడ్మ్యాన్ టు టైకూన్’ అనే బుక్ ను ప్రింట్ చేసింది. ఆ పుస్తకంలో తన పరువుకు భంగం వాటిల్లే అంశాలు ఉన్నాయని..దాని వల్ల ఆర్థిక ప్రయోజనాలను, కీర్తిప్రతిష్టలను దెబ్బతీసే విధంగా సమాచారం ఉందని రాందేవ్ బాబా కోర్టుకు తెలిపారు.
దీంతో ఢిల్లీ హైకోర్టు ఆ పుస్తకం అమ్మకాలను, ప్రింట్ ను నిలిపేయాలని తీర్పు చెప్పింది. కాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే రాందేవ్ బాబాకు నోటీసులు పంపినట్లు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్త నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.