తెలంగాణ ఎన్నికల సమయంలో ముందు జాగ్రత్త చర్యలగా పోలీసులు అన్ని వైపుల తనిఖీలు చేస్తూ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్రమంగా డబ్బు తరలింపు విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు నేతలు తమ ప్రచారాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి తెలంగాణలో పార్టీ అధినేతలతో బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీన సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం దానకిషోర్ ఆదేశించారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారట్లు అధికారులు తెలిపారు.
మద్యం దుకాణాలతో పాటు అన్ని బార్లు, బార్లతో కలిసుండే రెస్టారెంట్ లు, పబ్ లు, స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ లు మూసివేయాలని, మిలటరీ క్యాంటీన్లలో మద్యం అమ్మకాలు జరుపవద్దని ఆదేశించారు. అంతే కాదు పోలింగ్ కేంద్రాల వద్ద నలుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడటాన్ని నిషేధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.