రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు దళిత గిరిజనుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలంటూ ప్రస్తుతం ఆందోళనలు జరుగుతుండటం, కులం పేరుతో ఓట్లు అడగడంతో ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజస్థాన్లోని మల్పురా నియోజకవర్గం ఎన్నికల సభలో పాల్గొన్న ఆదిత్యనాథ్ మాట్లాడుతూ హనుమంతుడు గిరిజనుడు. ఆయన అడవిలో నివసించేవాడు.
రాముడి కోరిక మేరకు హనుమంతుడు తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం ఇలా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నించాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హనుమంతున్ని దళితుడంటూ యోగి చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ సర్వ బ్రాహ్మణ మహాసభ లీగల్ నోటీసు ఇచ్చింది. మూడు రోజుల్లో క్షణాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు జాతీయ గిరిజన్ కమిషన్ నుంచి మద్దతు లభించింది.
ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో నందకుమార్ మాట్లాడుతూ.. గిరిజన కమ్యూనిటీలో హనుమాన్, వానర, గిద్ద, జతయు లాంటి అనేక ఉప కులాలు ఉన్నాయని పేర్కొన్నారు. రావణాసురుడిపై రాముడు యుద్ధం చేయడానికి హనుమంతుడు సహా అడవి ప్రాంతంలో నివసించే గిరిజనులు సహాయపడ్డారని నందకుమార్ పేర్కొన్నారు.