నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో కుంభకోణాలు ఊసు లేదు. అవినీతి జాడ లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల్లో కేసీఆర్ ఫ్యామిలీ కమీషన్లు దండుకుందని ఆరోపించడం తప్పితే నిర్ధిష్టమైన ఆరోపణలేమీ లేవు. కానీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కేటీఆర్ అవినీతిపై ఓ బాంబు పేల్చింది. కేటీఆర్ సత్యం రామలింగరాజు కొడుకుతో కలసి కోట్లు దోచేశారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆరోపించారు.
సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజుకు చెందిన కంపెనీకి 1500 కోట్ల రూపాయల కాంట్రాక్టును కేటీఆర్ దోచిపెట్టారని మధుయాష్కీ ఆరోపించారు. అలాగే వరంగల్లో మిషన్ భగీరథ కింద 700 కోట్ల కాంట్రాక్టును తేజరాజు కంపెనీకి ఇచ్చారని వివరించారు. కేటీఆర్ కు దమ్ముంటే ఇది అవాస్తవమని చెప్పాలని డిమాండ్ చేసారు. కాల్ హెల్త్ అనే కంపెనీకి తేజరాజు భార్య చీఫ్ గా ఉన్నారని తెలిపిన మధుయాస్కీ ఇది కేటీఆర్ బినామీ కంపెనీ అని వివరించారు.
ఈ కాల్ హెల్త్ కంపెనీలో మలేసియా, సింగపూర్ నుంచి కాల్హెల్త్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని మధుయాస్కీ అన్నారు. ఇలాంటి అక్రమాల వల్లే కేటీఆర్ ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని ఆరోపించారు. 2009లో కోటిన్నర రూపాయలు ఉన్న కేటీఆర్ ఆస్తులు ఇప్పుడు 41 కోట్లకు చేరాయని లెక్కలు చెప్పారు. అంతే కాదు.. బెంగళూరులో కేటీఆర్కు వ్యాపారాలు ఉన్నాయన్నారు. బెంగళూరు డాలర్స్ కాలనీలో ఎంపీ కవితకు బంగ్లా ఉందన్నారు. ఆ వివరాలు త్వరలోనే బయటపెడతామన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీ ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, సినీ నిర్మాతల నుంచి అడ్డగోలుగా కోట్లు దోచుకున్నారని ఆరోపించారు మధుయాస్కీ. అక్రమాల ద్వారా దోచుకున్న సొమ్మును దాచుకునేందుకే కేటీఆర్ తరచూ మలేసియా, సింగపూర్ పర్యటనకు వెళ్తుంటారని మధుయాస్కీ అన్నారు. మరి కాంగ్రెస్ ఆరోపణలపై కేటీఆర్ ఏమంటారో..?