తెలంగాణా లో శాసనసభ ఎన్నికలు పట్టుపని ఐదు రోజుల్లో జరగబోతున్నాయి ఇలాంటి తరుణంలో తెలంగాణ జన సమితి - టీజేఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు, న్యాయవాది రచనా రెడ్డి నేడు (ఆదివారం) ప్రకటించారు.
ఈ సందర్భంగా రచన మీడియాతో మాట్లాడుతూ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఎన్నికలకు ముందే మహాకూటమి కూర్పు జరిగిందని, అలాంటి కూటమితో కోదండరాం అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె ఆరోపించారు. మహాకూటమిలో తెలంగాణాకు సామాజిక న్యాయం జరగ లేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు.
మైనార్టీలకు టీజేఎస్ ఖాతా కింద ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, ఇక ఏవిధంగా మైనార్టీలకు న్యాయం జరిగిందని భావిస్తామని ఆమె ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామి గా ఉన్నారని పేర్కొన్నారు. మహాకూటమిలో చాలామంది నేతలను బలి పశువులను చేశారని మండిపడ్డారు.
కోదండరాం కాంగ్రెస్ తో కలిసి తనకు తానే ఓటమి పాలయ్యారని, అసలు మహాకూటమి గెలుపు సాధించటానికా? ఓటమి పొందటానికా? అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మహాకూటమి కూర్పులేదని, దానిలోని నేతలంతా చంద్రబాబు నాయుడికి రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఆమాత్రం ఇంగితజ్ఞానం ఉందని, నారా చంద్రబాబు నాయుడి ప్రచారాన్ని తిరస్కరిస్తారని అన్నారు.