ఏ గుమ్మం దగ్గర ఆ మాటలు మాట్లాడే నారా, నందమూరి వారసులను తరిమికొట్టండంటూ వైసిపి శాసనసభ్యురాలు ఆర్కే రోజా, మండిపడుతూ తెలంగాణా వాసులకు సందేశమిచ్చారు. ఆమె మాట్లాడుతూ: తెలంగాణ టీడీపీ లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలని చిత్తుగా ఓడించండి అన్నావ్!.. మరి ఏపీలో అదే మాట చెప్పగలవా? అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుద్దేశించి వైసిపి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు.
విజయవాడలోని వైసిపి కార్యాలయంలో రోజా విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే అభివృద్ధి చూసివచ్చారు అంటావ్! మరి తెలంగాణలో పార్టీ మారితే నీతి బాహ్యమా? అని అడిగారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందని వ్యాక్యానించారు. తెలంగాణ ప్రజలు వెర్రివాళ్లు కాదు చంద్రబాబు చెప్పే మాటలు విని ఓటు వేయడానికి అన్నారు. చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వెర్రివాడని చిత్తూరు జిల్లా ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రజలు చంద్రబాబుకి బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేశారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే చంద్రబాబుకి అందరూ బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజ్యాంగ పదవికే మచ్చతెచ్చారని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకర్ దాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన రెడ్డి గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్కి లేదని అన్నారు. ఏపీలో 23మంది ఎమ్మెల్యేలను టీడీపీ అక్రమంగా డబ్బులు పెట్టికొన్నపుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.
బాలకృష్ణ అసెంబ్లీకి రారు. హిందూపూర్ కి వెళ్లరు. కానీ తెలంగాణా లో ప్రచారానికి మాత్రం వెళ్తున్నారని విమర్శించారు. మీ బావ చంద్రబాబు వైసిపి ఎమ్మెల్యేలను కొన్నప్పుడు, వారిని మంత్రుల్ని చేసినపుడు లేవని నోరు ఇప్పుడెలా లేస్తుందని ప్రశ్నించారు. టీడీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తుంటే మీ నందమూరి కుటుంబం పౌరుషం ఏమైందని అడిగారు. నందమూరి సుహాసిని ని కూడా కరివేపాకులా వాడుకుంటున్నారని, ఓడిపోయే స్థానం కట్టబెట్టి ఆమెని బలిపశువుని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.