తుమ్మల నాగేశ్వరరావు.తెలంగాణా మొత్తంలో మార్మోగిన పేరు ఇది! తాజా మాజీ మంత్రి అయిన ఆయన 2014 తర్వాత తెలంగాణాలో ఏర్పడిన టీఆర్ ఎస్ ప్రబుత్వానికి అనుకూలంగా టీడీపీ నుంచి జంప్ చేసేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి కేసీఆర్ మంత్రి వర్గంలో సీటు కూడా పొందారు. ఏక ఛత్రాధిపత్యంగా ఖమ్మంలో తన చక్రం తిప్పిన తుమ్మల.. ఎంతటి వారినైనా లెక్కచేయని మనస్తత్వంతో ముందుకు సాగారు. తుమ్మల టీఆర్ఎస్లోకి ఎంట్రీ ఇచ్చాక ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నా చివరకు ఆయన మాటే నెగ్గేది. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ ఆయన సీన్ పూర్తిగా రివర్స్ అవుతున్నట్టే కనపడుతోంది. ప్రస్తుతం తెలంగాణా ఎన్నికల్లో పోరు తీవ్రంగా సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలో పార్టీని గెలిపించుకునే బాధ్యతను ఒక్కొక్క మంత్రికి అప్పగించింది.
ఈ నేపథ్యంలో ఖమ్మంలోని 10 నియోజకవర్గాల్లోనూ టీఆర్ ఎస్ కారు పరుగులు పెట్టేలా చూసే బాధ్యత, అభ్యర్తులను గెలిపించే బాధ్యతను కేసీఆర్.. తుమ్మలకు అప్పగించారు. మొదట్లో అంటే.. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించిన రోజున ఈ బాధ్యతను ఎంతో గౌరవంగా, బాధ్యతగా తీసుకున్నారు తుమ్మల. ఇది పెద్ద పని కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. చిటికెల మీద ఇక్కడ అభ్యర్థులను గెలిపిస్తానని కేసీఆర్ ముందు ప్రగల్భాలు కూడా పలికాడు. అయితే, అసలు విషయం రంగంలోకి దిగితేనే కానీ తెలియలేదు తుమ్మలకు. ఖమ్మం గుమ్మంలో టీఆర్ ఎస్కు పూర్తిస్థాయిలో వ్యతిరేక గాలి వీస్తోంది. ముఖ్యంగా పలు నియోజకవర్గాల్లో ప్రజలు అధికార పార్టీ నాయకులను అడగు కూడా పెట్టొద్దని చెబుతున్నారు.
ఇదిలావుంటే, తుమ్మలకు తన సెగ్మెంట్లోనే ఎదురు గాలి వీస్తుండడంతో ఆయనకు మతిపోతున్న పరిస్థితి ఎదురవుతోంది. అంతేకాదు, తనకు తీవ్రమైన ఎదురీత ఈదాల్సిన దుస్థితి నెలకొంది. మరోపక్క, కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కందాళ ఉపేందర్ రెడ్డి నుంచి తుమ్మలకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఆయన స్థానికుడు కావడం, ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు కాంగ్రెస్తో పాటు కూటమిలో ఉన్న పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుతో ఇప్పుడు కందాళ దూసుకుపోతున్నారు. దీంతో తన పరిస్థితి దారుణంగా మారిన నేపథ్యంలో ఇక, జిల్లా రాజకీయాలలో టీఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించడం అంత ఈజీకాదని భావించి చేతులు ఎత్తేశాడు తుమ్మల. తననియోజకవర్గంలోనే తన గెలుపు విషయంపైనా తర్జన భర్జన పడుతున్న తుమ్మల ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి ఉంది.
ఇక, ఇక్కడ తన వల్ల కాకపోవడం, ప్రజల్లో వ్యతిరేకతను చూసిన తర్వాత.. ఏకంగా కేటీఆర్ను రంగంలోకి దింపి తనకు ప్రచారం చేయించుకోవడం విశేషం. ఆదివారం పాలేరులో మంత్రి తుమ్మల ప్రచారానికి వచ్చిన కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు గెలిపించే బాధ్యత నీదే అని కేసీఆర్ తుమ్మలకు అప్పగిస్తే చివరకు ఆయన తన సొంత నియోజకవర్గంలోనే గెలుపు కోసం ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. పైగా తన ప్రచారం కోసం కేసీఆర్, కేటీఆర్ను సైతం రప్పించుకున్నారు. దీనిని బట్టి ఇక, తుమ్మ సత్తా ఏమిటో తెలిసిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు.. అమ్మమ్మా.. తుమ్మలా.. కేరాఫ్ పోతోందమ్మా అన్న చర్చలు జిల్లాలో నడుస్తున్నాయి.