బావగారి రాజకీయ విజయం కోసం బామ్మర్ధిపడే తపన అంతా ఇంతా కాదు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తున్న సీనీ నటుడు, నట సింహం తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దిమ్మదిరిగే హెచ్చరిక చేశారు. నారా చంద్రబాబు నాయుడు తమ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టినట్లే, మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామని, గతంలో తెలంగాణా ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సందర్భంగా దానికి నందమూరి బాలకృష్ణ బదులిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ గడ్డిఅన్నారంలో రోడ్-షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తరిమికొట్టడం ఖాయ మన్నారు. అప్పుడు కేటీఆర్ అన్నట్లు ఆంధ్రాకే కాదు, ఎక్కడికైనా కేసీఆర్ కుటుంబం పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆంధ్రాకు రా! అక్కడ చూసుకుందాం! అంటూ బాలయ్య ప్రతి సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ విదేశాల్లో పర్యటించి లక్షల కోట్ల పెట్టుబడులు తరలించుకొని తెచ్చారని నట సింహం బాలకృష్ణ అన్నారు. కేసీఆర్ అలా తెలంగాణ అభివృద్ది కోసం ఏమైనా చేశాడా? అని ప్రశ్నించారా? ఆయన అధికారంలో ఉండగా చేసిందల్లా ఫామ్ హౌస్ లో పడుకోవడమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది హిస్టరీ అయితే కేసీఆర్ ది లాటరీ అంటూ తనదైన సినిమా డైలాగులతో బాలకృష్ణ విమర్శించారు.