తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. 7న పోలీంగ్ నేపథ్యంలో పార్టీ నేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు. అన్ని పార్టీల అధినేతలు స్వయంగా ప్రజల ముందుకు వెళ్లి తమ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి, మేనిఫెస్టోల గురించి వివరించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. నేడు కొడంగల్ లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీటిగ్ నేపథ్యంలో తనపై దాడులకు నిరసనగా నేడు కొడంగల్లో నిర్వహించనున్న కేసీఆర్ సభను అడ్డుకుంటానని రెండు రోజుల క్రితం రేవంత్ హెచ్చరించారు.
అలాగే, నేడు కొడంగల్ బంద్కు పిలుపునిచ్చారు. దాంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈసీ ఆదేశాల మేరకు రేవంత్పై కొడంగల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కేసులు నమోదు చేశారు. రేవంత్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఇంటి వాచ్మెన్, గన్మెన్లతోపాటు ఆయన సోదరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నేడు కోస్గిలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని, సభను జరగనివ్వబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.