ప్రస్తుతం ఏపీలో అధికార పక్షం ఎమ్మెల్యేలు, మంత్రులకు తెలంగాణా ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా అక్కడ పర్యటిస్తూ.. క్షేత్రస్తాయిలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం మహాకూటమి అభ్యర్థులు ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా బాబు తెలంగాణాలో రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన అక్కడి అధికార పార్టీ టీఆర్ ఎస్, సీఎం కేసీఆర్ వైఖరులను నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రజల నుంచి అధికార పార్టీకి ఎదురవుతున్న వ్యతిరేకతను మరింత దగ్గరగా గమనిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణాలో కేసీఆర్ ఏవైతే.. తప్పులు చేస్తున్నారో.. వాటిని తాను చేయకుండా చూసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదేసమయంలో .. ఏ పరిణామాల కారణంగా ప్రజల్లో కేసీఆర్ కు వ్యతిరేకత వస్తోందో .. ఆ పరిణామాలను తాను కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు పడతారని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం తెలంగాణా వంతు అయిపోయింది. ఇక, మరో నాలుగు మాసాల్లోనే ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటున్నారు. వీటిని సాకారం చేసుకునేందుకు ఆయన అనేక వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే పరిణామం తెలంగాణాలోనూ కనిపించింది.
అక్కడ కూడా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అనేక పథకాలు అమలు చేశారు. కానీ, ఇప్పుడు అవన్నీ వికటిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ముందస్తు సర్వేలు కూడా ఇదే విషయాలను వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా కేసీఆర్ చేసిన ప్రధాన తప్పిదం.. సిట్టింగులకు గుండుగుత్తుగా టికెట్లు ప్రకటించడం, ప్రజల్లోవారికి ఉన్న హవాను, వ్యతిరేకతను లెక్కలు వేసుకోకుండా తానే గొప్ప. తన నిర్ణయమే గ్రేట్ అనుకునే రేంజ్లో కేసీఆర్ వ్యవహరించి తప్పులు చేసి.. ఇప్పుడు ఓటమిని కౌగిలించుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు ఏపీలో ఇలాంటి తప్పు జరగకుండా చర్యలు తీసుకుంటే.. సగానికిపైగా ఎమ్మెల్యేలకు దిక్కు ఉండదని ఇప్పటికే టీడీపీ సీనియర్లు ప్రకటించేశారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొద్ది రోజుల కిందట ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను కొత్తవారికి అవకాశం ఇస్తే.. బాబుకు తిరగులేదని ఆయన చెప్పిన మాట నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే.. తమ పరిస్తితి ఏంటని ఇప్పుడు ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మదన పడుతున్నారు. మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.