కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి మరియు తెలంగాణా కాంగ్రెస్ నాయకుల్లోని అసమర్థతను చేతగాని తనాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉపయోగించు కుంటు న్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.
కృష్ణా బేసిన్ లో నీళ్లులేవని కోదాడ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనటాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. చంద్రబాబు నూరు శాతం అబద్ధం చెప్పారని మండిపడ్డారు. తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యమని, కేసీఆర్ నాయకత్వంలోని టీఆరెస్ ప్రభుత్వం ఉంటే తన నాటకాలు సాగవన్నది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసనని అన్నారు.
తెలంగాణాలో ప్రజా కూటమితో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వేల కోట్ల రూపాయలు ఇక్కడికి తరలిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు అనేక కుట్రలు చేశారని, తెలంగాణ నుంచి ఆయన్ని తరిమివేశారనే కసి, కక్ష, కార్పణ్యంతో ఆయన ఈ రాష్ట్రంపై టీఆరెస్ ప్రభుత్వంపై పగబట్టారని అన్నారు.
మరోవైపు అధికారం కోల్పోయిన నాటి నుండి కాంగ్రెస్ నేతలకు తెలంగాణాపై కడుపు మంటగా ఉందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణాపై కత్తులు దూసు కొస్తున్నాయని, ప్రజలు అప్రమత్తతతో మెలగాలని హెచ్చరించారు. తన కంఠంలో ప్రాణం ఉండగా, తెలంగాణ ప్రజలను ఆంధ్ర ప్రదేశ్ నాయకులకు గాని డిల్లీ నాయకత్వానికి గాని బానిసలుగా మారనివ్వనని అన్నారు. ణిన్న బుధవారం గజ్వేల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.
"చాలా కష్టపడి అనేక పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. 58ఏళ్ల సుదీర్ఘ పోరాటం మనది. త్యాగాల పునాదులపై వచ్చిన తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందాలి. దుఃఖం లేని తెలంగాణ చూడాలన్నదే నా లక్ష్యం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ ను దెయ్యాల పాలు చేయొద్దు. మన ప్రాజెక్టులు నిండాలి, పంటలు పండాల అనేది నా ఆశయం. గత నాలుగేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో, ఎలాంటి అభివృద్ధి జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారు. పేదల కంట కన్నీరు రాని తెలంగాణ నా స్వప్నం. దుఖంలేని తెలంగాణ నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం. కోటి ఎకరాలకు సాగు నీరు కచ్చితంగా పారేలా నేను యజ్ఞం చేస్తున్నా. ఇది కొనసాగాలి. ఈ యజ్ఞం, ఈ ప్రయాణం ఆగొద్దు. తెలంగాణ గెలిచి నిలవాలి. నవ్వేటోళ్ల ముందు జారిపడొద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో ఓటు వేయాలి. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని చూసి దిల్లీ నేతలు ఆశ్చర్యపోయారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ సంక్షేమంలో ముందుంది. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించి ప్రజలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో మనమే ముందున్నాం. రూ.42వేల కోట్ల మేర ఖర్చుపెట్టి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాం" అని కేసీఆర్ ఉద్వేగంగా అన్నారు.
"పోరాడి తెచ్చుకున్న తెలంగాణ దుర్మార్గుల పాలు కావొద్దు. దండిగా ఉన్న తెలంగాణను ఆంధ్ర లో కలిపి ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 700 అడుగులు బోరు వేస్తే కానీ నీళ్లురాని పరిస్థితి. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ఆనాడు కిరణ్కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ నేతలు ఆయన్ను ప్రశ్నించ లేదు. తెరాస గెలిస్తే కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న వాగ్ధానం నెరవేరనున్నది. టీఆరెస్ గెలిస్తే తెలంగాణకు కాళేశ్వరం పూర్తవుతుంది. చంద్రబాబు కూటమి గెలిస్తే శనీశ్వరం తగులు కుంటుంది. దొంగ సర్వేలు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దు. 100 కు పైగా స్థానాల్లో గెలిచి తెరాస మళ్లీ అధికారంలోకి వస్తుంది. గజ్వేల్ నియోజక వర్గంలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాను. నియోజక వర్గంలో ప్రతి ఇంటికీ రెండు పాడి గేదెలు ఇస్తాం" అని కేసీఆర్ హామీ ఇచ్చారు.