ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ఏర్పాటు అన్నీ పూర్తి చేశామని..ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం నుంచి బలగాలను మోహరించామని..అన్ని పోలీంగ్ కేంద్రాల్లో ఈవీఎం మిషన్లు సక్రమంగా పనిచేసేలా చూస్తున్నామని..పోలీంగ్ కేంద్రాల వద్ద రాజకీయ నేతలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో సరికొత్తగా వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఓటరు తాను వేసిన వ్యక్తికే తన ఓటు పడిందీ లేనిదీ తెలుసుకునే వీలుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య ప్రజలతోపాటూ... నేతలు కూడా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమకు ఎక్కడ ఓటు ఉందో ఆయా నియోజకవర్గానికి వెళ్లేందుకు ఎవరికి వారు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. సోమాజిగూడ ఎంఎస్ మక్తాలోని అంగన్వాడీ కేంద్రంలో గవర్నర్ నరసింహన్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా తన సొంతూరైన సిద్దిపేట మండలం చింతమడకలో ఓటు వేయబోతున్నారు. ఇందుకోసం ఉదయం 11 గంటలకు ఆయన హెలికాప్టర్లో చింతమడక వెళ్తారు.
హరీశ్ రావు సిద్దిపేట బూత్ నంబరు 107లో ఓటు వేయబోతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 2లోని సెయింట్ నిజామిస్ స్కూల్లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎంపీ కవిత బోధన్ నియోజకవర్గంలోని పాతంగల్లో ఓటు వేయనున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో, తార్నాకలో టీజేఎస్ చీఫ్ కోదండరాం, చిక్కడపల్లిలో లక్ష్మణ్, రాజేంద్రనగర్లోని వట్టేపల్లిలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, హుస్నాబాద్ రేకొండలో చాడ వెంకటరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ నేత పరిపూర్ణానంద, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓటు వినియోగించుకోనున్నారు.
అంబర్పేట ఇంద్రప్రస్థ కాలనీలో తమ్మినేని ఓటు వేయనుండగా, గద్దర్ తొలిసారిగా మల్కాజిగిరిలో వేయనున్నారు. కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారవ్వగలవు కాబట్టి... ప్రతి ఒక్కరూ ఓటును నిర్లక్ష్యం చెయ్యకుండా వెయ్యాలని కోరుతున్నారు. ఇతర ముఖ్యనేతలు తమ ఓటు ఎక్కడుందో తెలుసుకొని అక్కడ ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు.