కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుతం బరిలో నిలిచిన కొడంగల్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఉన్నాయని అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు. అక్కడ రేవంత్ కు గెలుపు ఖాయమనే వ్యాఖ్యలు తరచుగా వినిపించాయి. ఇప్పుడు కూడా ఆయనకుఅ నుకూలంగా నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా శుక్రవారం పోలింగ్ ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకే ఇక్కడ 37 % పోలింగ్ నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం.
అదేసమయంలో సాయంత్రంవరకు ఇదే ట్రెండ్ కొనసాగితే.. రేవంత్ గెలుపుతోపాటు.. మెజారిటీ ఏకంగా లక్ష వరకు ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. ఇంతలోనే ఇక్కడ రాజకీయంగా పెద్ద అలజడి చెలరేగింది. రేవంత్ రెడ్డి ఇంటికి చుట్టుపక్కల ఉండే గ్రామాలకు, మండలాలకు చెందిన దాదాపు 2 వేల మంది ఓటర్ల ఓట్లు ఎన్నికల సంఘం జాబితాలో లేకపోవడంతో అందరూ రోడ్ల మీదకు వచ్చారు. తమకు ఓటు హక్కు ఉందని.. కానీ, ఇక్కడ రేవంత్ గెలుస్తాడనే భయంతోనే ఓట్లను తొలగించారని, తమకు న్యాయం జరిగే వరకు రోడ్డు మీదనే ఉంటామని వారు తేల్చిచెప్పారు.
దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇక్కడ రేవంత్ హవాకు అడ్డుకట్ట వేయాలని ఆది నుంచి చూస్తున్న అధికార పార్టీ నేత, సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏకంగా ఓట్లనే తొలగించిన విషయం చాలా దుమారానికి దారి తీస్తోంది. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఇక్కడి వారు చేస్తున్న నినాదాలు కూడా భారీ ఎత్తున మీడియాలో వినిపిస్తున్నాయి. ఎన్నికల రోజు ఈ విధంగా కుటిల రాజకీయాలు చేయడం మంచిది కాదనే అబిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. గెలుపు ఓటములు అనేవి సహజమని, దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ఉంటే మేలని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. 2 వేల మంది ఓట్లు గల్లంతు కావడం రికార్డుగా ఉందని అంటున్నారు. ఇదంతా కూడా రేవంత్ గెలుపును ఆపేందుకు చేస్తున్న ప్రయత్నంగా నే చెబుతున్నారు.