రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న నాయకులు నేడు శత్రువులు కావొచ్చు. నిన్నటి వరకు శత్రువులుగా ఉన్న నాయకులు కూడా మిత్రులు కావొచ్చు. కాబట్టి.. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు అనంతపురం జిల్లా హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రబాబు బావమరిది, నటుడు బాలకృష్ణ ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి బాలయ్యకు సహకరించి గెలుపు గుర్రం ఎక్కేలా చేసిన వ్యక్తి ఇప్పుడు విపక్షం వైసీపీలో చేరిపోయారు. నిజానికి బాలయ్య గత ఎన్నికల్లో గెలిచింది.. ఈయన సాయంతోనే! సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్న ఆయనే అబ్దుల్ ఘనీ. ముస్లిం వర్గానికి చెందిన నాయకుడుగా స్థానికంగా టీడీపీని ఏకతాటిపై నడిపించి చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొల్లగొట్టారు. గత ఎన్నికల్లో హిందూపురం టికెట్ను ఆశించారు.
అయితే, బాలయ్య రంగ ప్రవేశంతో ఘనీ తప్పుకొని బాలయ్యకు అవకాశం వచ్చేలా చేశారు. అప్పట్లోనే చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యం ఇస్తానని, మంచి పదవి కూడా ఇస్తానని ఇచ్చిన హామీ నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఆయనకు ఇవ్వలేదు. పైగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఘనీని పలకరించడం కూడా మానేశారు. దీంతో ఘనీ తీవ్రస్థాయిలో మనస్థాపానికి గురయ్యారు. హిందూపురం శాసనసభకు 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన అబ్దుల్ ఘనీ.. 2014లో బాలకృష్ణ కోసం సీటు వదులుకున్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పిన అబ్దుల్ ఘనీ.. నాలుగేళ్ల వరకు టీడీపీలోనే కొనసాగారు. అయితే, తనకు బాబు ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో కొద్ది రోజుల నుంచి టీడీపీకి దూరంగా ఉన్నారు. ఇక, తాజాగా ఇప్పుడు వైసీపీలోకి చేరిపోయారు. టీడీపీలో 30 ఏళ్లుగా పనిచేసినా ప్రాధాన్యత లేదన్నది ఘనీ ఆవేదన.
అంతేకాదు, ఈ నాలుగున్నరేళ్లలో మైనారిటీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని అబ్దుల్ ఘనీ విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని ఘనీ అన్నారు. మొత్తానికి 2014లో బాలయ్యకు మిత్రుడిగా వ్యవహరించిన ఘనీ ఇప్పుడు శత్రుపక్షంలో చేరిపోవడంతో హిందూపురంలో సమీకరణలు మారిపోయాయి. ఇప్పటికే వైసీపీ ఇక్కడ బలంగా ఉంది. వైసీపీ నియోజకవర్గం ఇంచార్జుగా ఉన్న నవీన్ నిశ్చల్ అన్నీ తానై పార్టీని ఇక్కడ బలోపేతం చేశారు. దీంతో వాడవాడలా ఇక్కడ వైసీపీ పుంజుకుంది. ఇక,టీడీపీ బలమైన ఆయుధంగా ఉన్న ఘనీ కూడా టీడీపీ నుంచి బయటకు రావడంతో మైనార్టీ ఓట్లు కూడా వైసీపీకి సానుకూలంగా మారే పరిస్థితి ఉంది.
దీంతో బాలయ్యకు వచ్చే ఎన్నికలు అగ్ని పరీక్షగానే మారుతాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక, ఎమ్మెల్యేగాఆయన విజిటింగ్ చేశారు తప్ప.. ఏనాడూ ఒక నెల రోజులు ఇక్కడే ఉండి అభివృద్ధిని పట్టించుకున్నదీ లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరిస్తున్నానని చెబుతూ బుల్లెట్పై తిరిగి హడావుడి చేయడం తప్పితే .. బాలయ్య ఇక్కడ చేసింది ఏమీలేదనేది కొందరు ప్రజల్లో పెరిగిన అసంతృప్తి. అలాగే మరికొందరిలో ఆయన స్థానికంగా ఉన్నా లేకపోయినా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారన్న టాక్ కూడా ఉంది. మొత్తంగా ఇక్కడ బాలయ్యకు ఎదురు గాలులు వీచడంతోపాటు మిత్రుడు గా ఉన్న ఘనీ శత్రువుగా మారడంతో గెలుపు గుర్రం ఎక్కడం అంత ఈజీకాదని ఇక్కడి రాజకీయ నేతలు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో ? టీడీపీ వజ్రపుకోటలో వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో ? చూడాలి.