తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వేరు వేరు పార్టీలుగా ఉన్న ఈ రాజకీయ పక్షాలు.. తమ అన్నింటినీ ఒకే పార్టీగా గుర్తించాలంటూ గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మేరకు గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ప్రజాకూటమి హోరాహోరీగా పోరు సాగించాయి. ఇరు పక్షాలూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎవరు గెలిచిన స్వల్ప ఆధిక్యత మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మరోవపు ఏ పక్షానికీ మెజారిటీ రాని పరిస్థతి కూడా తలెత్తే అవకాశం కూడా ఉంది.
ఒక వేళ హంగ్ వస్తే అప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అప్పుడు గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. మెజారిటీ సాధన కోసం పార్టీలు ఎలాంటి రాజకీయాలకైనా వెనుకడుగు వేయవు. అదే పరిస్థితి వస్తే గవర్నర్ ది కీలక పాత్ర అవుతుంది. అందుకే తమను ఒక జట్టుగా గుర్తించాలని ఈ నాలుగు పార్టీలు గవర్నర్ కు ముందుగానే విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత రాజ్యాంగ విరుద్ధమైన పద్దతులకు ఆస్కారం లేకుండా గవర్నర్ ను ముందుగానే అప్రమత్తం చేయాలని ఈ కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఎంఐఎం కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కూటమి నేతలు భావిస్తున్నారు.