తెలంగాణలో ఎవరు సీఎం కుర్చీ ఎక్కుతారు.. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మరో 24 గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అప్పటివరకూ ఇరు పక్షాలూ తమకు ఎన్ని సీట్లు వస్తాయో బేరీజు వేసుకుంటూ తామే గెలుస్తామని ప్రకటిస్తూ ధీమాగా కాలం గడుపుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా భిన్నమైన తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
జాతీయ సర్వేలన్నీ గులాబీ పార్టీదే గెలుపని ఢంకా భజాయించినా లోకల్ సర్వే ఎక్స్ పర్ట్ లగడపాటి రాజగోపాల్ మాత్రం మహా కూటమిదే గెలుపని క్లారిటీగా చెప్పేశారు. అంతే కాదు.. 65 స్థానాల వరకూ కూటమి గెలుస్తుందని తేల్చి చెప్పేశారు. అయితే అదే సమయంలో ఆయన తనకు పూర్తిగా ప్రజానాడి అందలేదని కూడా చెప్పారు. మరోసారి పోస్ట్ పోల్ కూడా సర్వే చేస్తానని చెప్పారు.
ఈ మాటలు డిసెంబర్ 7 చెప్పారు లగడపాటి. ఈపాటి పోస్ట్ పోల్ సర్వే కూడా పూర్తయి ఉండాలి. అయితే ఈ పోస్ట్ పోల్ సర్వే వివరాలు మీడియాకు వెల్లడిస్తారా.. లేక తనకు తానే తన ఫలితాలను క్రాస్ చెక్ చేసుకుని వదిలేస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు. ఒకసారి ఫలితాలంటూ ఇచ్చేశాక ఇక మళ్లీ సవరణలు ఇస్తే బావుండదు కాబట్టి ఆయన మీడియా ముఖంగా ప్రకటించే అవకాశం కనిపించడం లేదు.
అయితే.. గతంలో ఏ సర్వే విషయంలోనూ లగడపాటి ఇలా పోస్ట్ పోల్ సర్వే చేస్తానని చెప్పలేదు. ఇలా చెప్పడం అంటే.. తన అంచనాలు తప్పయితే.. నేను ముందుగానే చెప్పాను కదా.. ఓటరు నాడి సరిగ్గా అందలేదని.. అని చెప్పుకునేందుకు ఓ ఆప్షన్ ను లగడపాటి ఉంచుకున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ లగడపాటి సీక్రెట్ సర్వే.. ఏం చెబుతుందో.. అంతా సీక్రెట్.