ఎంతో ఉత్కంఠను రేపుతున్న తెలంగాణా ఎన్నికల్లో అధికార తెలంగాణా రాష్ట్ర
సమతిలో అంతర్గతంగా ఓ చర్చ బాగా నడుస్తోంది. అదేమిటంటే, ఐదుగురు మంత్రుల గెలుపు
కష్టమేనని. టిఆర్ఎస్ కు 108 సీట్లు
వస్తున్నాయని కెసియా స్వయంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపేమో ఐదుగురు
మంత్రులు ఓడిపోతారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోందంటే ఏమటర్ధం ? పైగా ఓటిమి
కోరల్లో ఇరుక్కున్నారని ప్రచారం జరుగుతున్న ఐదుగురు మంత్రుల్లో నలుగురు గురించి కెసియార్
ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాండంగా చెప్పిన విషయం తెలిసిందే. అంతా బాగా పనిచేసిన
నలుగురు మంత్రులు ఓడిపోతారని ప్రచారం జరగటం ఆశ్చర్యంగా ఉంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, పోలింగ్ ముగిసిన తర్వాత కెసియార్ ఓ సర్వే చేయించుకున్నారట. అదే సమయంలో పార్టీ వర్గాల నుండి అన్నీ నియోజకవర్గాల నుండి ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దాని ప్రకారం ఐదుగురు మంత్రులు చందూలాల్ చంద్రాకర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, పట్నం మహేందర్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి అంచుల్లో నిలిచారని సమాచారం వచ్చిందట. పై ఐదుగురు మంత్రులు తమ నియోజకవర్గాల్లో మొదటి నుండా కూడా గట్టి పోటీని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మంత్రులు అంత గట్టి పోటీని ఎందుకు ఎదుర్కొంటున్నారంటే నియోజకవర్గాల్లో వారికున్న పట్టు పూర్తిగా సడలిపోవటమే కాకుండా జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయిందట.
చందూలాల్ వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో పోటీ చేశారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్న మంత్రి నియోజకవర్గంలో పర్యటించిందే చాలా తక్కువ. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి పట్టించుకున్న పాపాన కూడా పోలేదట. దాంతో ఇంటా, బయట కూడా మంత్రిపై వ్యతిరేకత పెరిగిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మహాకూటమి తరపున సీతక్క పోటీ చేసింది. దాంతో మంత్రి గెలుపు కష్టమే అన్నది సమాచారం. ఇక సూర్యాపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డిది మరో కథ. మంత్రికి జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ నుండి విపరీతమైన పోటీ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ మొదటి నుండి మంత్రి వెనకాలేపడ్డారు. అదే సమయంలో మంత్రి వ్యవహారశైలి వల్ల పార్టీలో కూడా వ్యతరేకత పెరిగిపోయిందట. దాంతో సొంత పార్టీ నేతలు మంత్రి గెలుపును దెబ్బకొట్టారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డిది మరో కథ. రంగారెడ్డి జిల్లాలో తనకు ఎదురన్నదే లేకపోవటంతో మంత్రికి పార్టీలోని ఇతర నేతలకు బాగా గ్యాప్ వచ్చేసిందట. ఏ విషయంలో కూడా ఎంఎల్ఏలు, ఎంపిల మాట చెల్లుబాటు కాకుండా చేసేశారనే ఆరోపణలు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే కెసియార్ దగ్గర మంత్రి మాట మాత్రమే చెల్లుబాటవుతోందో అప్పటి నుండే మహేందర్ రెడ్డి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఎలాగంటే ఎంపిలు, ఎంఎల్ఏలు, నేతలు పట్నంకు బాగా వ్యతిరేకమైపోయారు. చేవెళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సమయంలో కూడా పట్నం వైఖరి వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి మంత్రిని ముంచారనే ప్రచారం బాగా జరుగుతోంది.
ఇక, సనత్ నగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిరాయింపు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ది వేరే కథ. మంత్రిగా నియోజకవర్గం కోసం చేసిందేమీ లేదన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయ్. అదే సమయంలో సెటిల్మెంట్లు, సొంత దందాలకు మాత్రమే మంత్రి ప్రాధాన్యత ఇచ్చారని పార్టీలోని ప్రచారం జరుగుతోంది. దాంతో నియోజవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవటంతో జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది.
చివరగా ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీద కూడా నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఎప్పుడూ హైదరాబాద్ లోనే కూర్చుని జిల్లాని, నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారనే ఆరోపణలు ఎక్కువైపోయాయి. దానికితోడు మహకూటమి తరపున పోటీ చేసిన ఏలేటి మహేశ్వరరెడ్డికి కూటమిలోని కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ పార్టీలు గట్టిగా పనిచేశాయట. దాంతో మంత్రి గెలుపుపై నమ్మకం లేదని పార్టీలోనే చెబుతున్నారు. మంత్రుల పరిస్ధితే ఇలాగుంటే ఇక ఎంఎల్ఏల్లో చాలామంది పరిస్ధితి గురించి కొత్తగా చెప్పేదేముంది ?