తెలంగాణలో గత నెల నుంచి ఎన్నికల హడావుడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు ప్రచారాలతో మారుమోగించారు. మహాకూటమి నుంచి సోనియా, రాహూల్ గాంధీ లతో పాటు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రచారం చేశారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరుపు నుంచి ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీర్, కేటీఆర్, హరీష్ రావు లు ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. ప్రచారం ముగిసిన తర్వాత ఎవరి గెలుపు వారిదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రేపు ఎన్నికల ఫలితాలు..రాజకీయ నేతల్లోనే కాదు ప్రజల్లోనూ ఎంతో ఉత్కంఠత నెలకొంది. ఎవరు గెలవబోతున్నారో కచ్చితంగా ఓ నిర్ణయానికి రాలేకపోతున్న ముఖ్య పార్టీల నేతలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల అనంతరం ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇక ప్రజా ఫ్రంట్ గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు కూటమి, టీఆర్ఎస్ ఏ పార్టీ గెలిచినా 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి కనుక విజయం సాధిస్తే మంగళవారమే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. 12న ఆ నేత ప్రమాణ స్వీకారం చేస్తారు. పంచమి రోజే మంచిదని నేతలు అభిప్రాయపడుతున్నట్టు కనిపిస్తుంది.