తెలంగాణ ఎన్నికల్లో వంద సీట్లుపైగానే గెలుస్తాం.. ఇదీ కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నమాట. ఇంకా ఆరునెలలు అధికారం అనుభవించే అవకాశం ఉండగానే.. ముందస్తుకు వెళ్లిన ఈ గులాబీ నేత రాజీనామా చేసిన రోజు నుంచి వంద సీట్లుపైగా గెలుస్తామనే చెబుతున్నారు. ఆ దీమాతోనే ముందస్తుకు వెళ్లారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి.
ఇప్పుడు 100 సీట్ల సంగతి పక్కకుపెడితే.. అసలు కేసీఆర్ కు మళ్లీ అధికారం వస్తుందా రాదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. హోరాహోరీ పోరు ఉంటుందన్న విశ్లేషణలతో కేసీఆర్ కూ ఓటమి భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ ఛానళ్లన్నీ కేసీఆర్ దే విజయమని చెప్పినా.. ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. సర్వేల దిట్ట లగడపాటి రాజగోపాల్ సర్వే కేసీఆర్ మట్టికరబోతున్నారని చెప్పడంతో గులాబీ బాస్ గుండెల్లో గుబులు మొదలైంది.
ఒక వేళ 40-50 సీట్లు మాత్రమే వచ్చి హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏంటన్న ఆలోచన కేసీఆర్ లో మొదలైందంటున్నారు విశ్లేషకులు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో నేటి మీటింగ్ ఆంతర్యం అదే అని విశ్లేషిస్తున్నారు. హంగ్ పరిస్థితి వస్తే ఎంఐఎం మద్దతు కీలకమవుతుంది. ఆ పార్టీ ఇప్పటికే తాము టీఆర్ఎస్ కు అనుకూలమని చెబుతున్నా.. ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కూడా.
అందుకే మజ్లిస్ పార్టీని మంచి చేసుకునేందుకు కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రత్యేకించి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంటున్నారు. మెజారిటీకి 10- 15 స్థానాలు తక్కువ వస్తే.. ఎంఐఎంతో పాటు బీజేపీ మద్దతు కూడా అవసరమవుతుంది. అందుకే బీజేపీ బయట నుంచి మద్దతు ఇచ్చినా ఎంఐఎం వ్యతిరేకించకుండా ఉండాలని కేసీఆర్ అసదుద్దీన్ ను కోరవచ్చు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎలాగూ కేసీఆర్ కు మద్దతు ఇస్తుంది. ఇన్ని పరిణామాలు ఉన్నందువల్లే నిన్ననే ఫోన్ లో మాట్లాడుకున్నా.. మళ్లీ ఇంటికి పిలిపించి ఆతిథ్యంతో అసదుద్దీన్ మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.