అవును ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందే పలువురు పార్టీల్లోని కీలక నేతలు
ఈ ఎంఎల్ఏ అభ్యర్ధి వెంట పడ్డారు. ఇంతకీ విషయం ఏమిటంటే, కరీంనగర్ జిల్లాలోరి
రామగుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్ధులతో పాట
టిఆర్ఎస్ రెబల్ క్యాండెట్ కోరుకంటి రామ్ చందర్ కూడా రంగంలో ఉన్నారు. టిఆర్ఎస్
తరపున సోమారపు సత్యనారాయణ పోటీ చేశారు. సోమారపుకు టిక్కెట్టు ఇవ్వవద్దంటూ ఎప్పటి
నుండో నియోజకవర్గంలోని నేతలు, శ్రేణులు గట్టిగా చెప్పారు. అయినా టిఆర్ఎస్ చీఫ్
కెసియార్ అందరి మాటలను పెడచెవిన పెట్టి
సోమారపుకే టిక్కెట్టిచ్చారు. సరే, ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అందరూ
నామినేషన్లు కూడా వేసేశారు.
అందరితో పాటు టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ధిగా కోరుకంటి కూడా నామినేషన్ వేశారు. టిఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవటంతో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున నామినేషన్ వేశారు. నామినేషన్ల ఘట్టం ముగియటంతో ఎవరి ప్రచారం వాళ్ళు మొదలుపెట్టేశారు. అయితే, కోరుకంటి భార్య అనారోగ్యంతో మరణించారు. దాంతో కోరుకంటి కొద్ది రోజులు ప్రచారానికి దూరమైపోయారు. సరే మొత్తానికి ప్రచారం అయిపోయింది, పోలిగ్ కూడా ముగిసింది. మంగళవారం కౌంటింగ్ విషయంలో అందరూ టెన్షన్ లో ముణిగిపోయారు.
ఇటువంటి పరిస్ధితుల్లో హఠాత్తుగా కోరుకంటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్ధులుండగా కోరుకంటికే ఎందుకు డిమాండ్ పెరిగిపోయింది ? ఎందుకంటే, రేపటి ఎన్నికల్లో గెలవబోయేది కోరుకంటే అని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారట. కౌంటింగుకు ముందే ఎలా నిర్ణయానికి వచ్చారంటే, పోలింగ్ తర్వాత ఏ పార్టీకాపార్టీ సర్వేలు యించుకున్నాయి కదా ? పోలింగ్ ట్రెండ్స్ ఎలాగున్నాయో తెలుసుకున్నాయి. ఏ పార్టీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నా కూడా అందరి అభిప్రాయాల ప్రకారం గెలవబోయేది కోరుకంటే అని తేలిందట. దాంతో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి నేతలు ఇఫుడు కోరుకంటి ఇంటికి క్యూ కడుతున్నారు.
అసలే రేపటి కౌంటింగ్ లో హగ్ వస్తుందేమో అన్న టెన్షన్ అన్నీ పార్టీలను పట్టి పీడిస్తోంది. ఆ నేపధ్యంలోనే కోరుకంటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పోయిన ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన కోరుకంటి టిఆర్ఎస్ అభ్యర్ధి సోమారపు సత్యనారాయణ చేతిలో ఓడిపోయింది కేవలం 2295 ఓట్ల తేడాతోనే. సోమారపు గెలిచిన దగ్గర నుండి ఆయన వ్యవహార శైలి నచ్చక పార్టీలో చాలామంది దూరమైపోయారు. ఈ ఎన్నికల్లో మళ్ళీ సోమారపుకే టిక్కెట్టిస్తే పనిచేసేది లేదని కూడా చాలామంది స్పష్టంగా కెసియార్ కే చెప్పారు. అయినా కెసియార్ వాళ్ళ మాటలను లెక్కపెట్టకుండా సోమారపుకే టిక్కెట్టిచ్చారు.
ఆ కోపంతో ఉన్న చాలామంది నేతలు కోరుకంటికి పనిచేశారు. అదే సమయంలో ఆయన భార్య చనిపోవటంతో సానుభూతి పెరిగిపోయింది. దానికితోడు పోయిన సారే అనవసరంగా సోమారపును గెలిపించామనే అభిప్రాయం జనాల్లో మొదలైందట. అందుకే అంతా కట్ట కట్టుకుని కోరుకంటికి ఓట్లేశారని తేలింది. దాంతో గెలుపు కోరుకంటిదే అని కన్ఫర్మ్ చేసుకున్న పార్టీలన్నీ ఇఫుడు కోరుకంటి వెంట పడ్డాయి. చూశారా జనబలం ఉన్న నేతల విషయంలో పార్టీలు ఎలా వెంటపడుతున్నాయో ? ఫలితాలు వెలువడక ముందే కోరుకంటిదే గెలుపని అన్నీ పార్టీల నేతలు తేల్చేయటం ఆశ్చర్యంగా ఉంది.