తెలంగాణలో హంగ్ వస్తే ఏంటీ పరిస్థితి అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ఎందుకంటే ఎవరికీ విజయంపై పూర్తి ధీమా లేదు. పోలింగ్ శాతం బాగా పెరిగినందువల్ల ఏదో ఒకవైపు వేవ్ ఉంటుందని అంచనాలు ఉన్నా.. హంగ్ వస్తే ఏం చేయాలనేదానిపైనే పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంలో సీఎం కేసీఆర్ పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తోంది.
ఎందుకంటే.. హంగ్ వచ్చినప్పుడు గవర్నర్ పాత్ర చాలా కీలకమవుతోంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాష్ట్ర పాలకుడు. ఆయన ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తాడన్నది ఆయన ఇష్టం. అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. దీన్ని అనేక మంది గవర్నర్ లు దుర్వినియోగం చేసిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు.
ఐతే.. సీఎం కేసీఆర్ కు ఈ విషయంలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కేసీఆర్ మొదటి నుంచి గవర్నర్ నరసింహన్ తో చాలా మంచి సంబంధాలు నెరుపుతున్నారు. నేను ముఖ్యమంత్రిని కదా అనే అహం చూపకుండా నరసింహన్ కు చాలా గౌరవం ఇచ్చేవారు. పండుగలు పబ్బాల సమయంలో రాజ్భవన్ కు వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవారు.
అలా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ అంటే నరసింహన్ కు చాలా ఆప్యాయత. అది ఇప్పుడు హంగ్ సమయంలో బాగా కలసి వచ్చే అవకాశం ఉంది. మెజారిటీకి టీఆర్ఎస్ కు సీట్లు తగ్గినా నరసింహన్ ముందుగా కేసీఆర్ నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది. కేంద్రంలో మోదీ సర్కారు ఉండటం కూడా ఓ పెద్ద ప్లస్ పాయింట్.