ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న నాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగులలో చాలా మటుకు సీట్లను వేరేవారికి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇప్పుడు కొత్తవారు కూడా ఆయా టికెట్ల కోసం ప్రధానంగా పోటీలో ఉండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నా యి. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి సీనియర్ నాయకుడు వట్టి వసంత కుమార్ ఎటు మొగ్గుతారనే విషయం సర్వత్రా చర్చకు వస్తోంది. ఇటీవల టీడీపీతో కాంగ్రెస్ జట్టుకట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన వట్టి కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే ఆయన వైసీపీలోకి చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు వట్టి కోసం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ప్రయత్నిస్తోందనే వార్తలు వస్తున్నాయి. దీంతో వట్టి రాజకీయంపై సర్వత్రా ఆసక్తి రేగింది. అయితే, ఆయన రాజీనామా చేసి 20 రోజులు గడుస్తున్నా కూడా.. ఇప్పటికీ.. ఆయన ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్కు రాజీనామా చేసిన వట్టి వసంత్ కుమార్వైపే అందరి దృష్టి ఉంది. ఆయన జనసేన పార్టీలో చేరతారన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను సంప్రదించింది.
ఉభయగోదావరి జిల్లా బాధ్యతలు చూస్తున్న ఒంగోలు ఎంపీ వైవి. సుబ్బారెడ్డి కూడా వట్టి వసంత్కుమార్తో సంప్రదించారు. అయితే నర్సా పురం ఎంపీ అభ్యర్థిత్వంపై ప్రతిపాదించినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ క్షత్రియ సామాజికవర్గానికి నర్సాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దాంతో వైసీపీలో వట్టి చేసిన ప్రతిపాదనపై ఆ పార్టీ పునరాలోచనలో పడింది. ఇలా జనసేన, వైసీపీలు కూడా వట్టి పైనే కన్నేశాయి. మొత్తానికి జనసేన పార్టీ ఇప్పుడు ఇతర పార్టీల నేతలపై వల వసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ప్రయత్నానికి వట్టి సహకరిస్తారా? లేక ఎటు మొగ్గుతారు? అనే విషయాలు ఆసక్తిగా మారడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే.. కొంత వెయిట్ చేయకతప్పదు!