గతంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతటి పరాభావం
ఎదురుకాలేదు. తాజాగా వెలువడిన తెలంగాణా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్
నేతల్లో చాలామంది ఎన్నికల్లో గెలవలేక కుప్పకూలిపోయారు. ఒకరు కాదు నలుగురు కాదు.
ఏకంగా దాదాపు 20 మంది ప్రముఖులు ఓడిపోయారంటే అర్ధమేంటి ? మహాకూటమి గెలిస్తే తామే
ముఖ్యమంత్రి అని అనుకున్న వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, దామోదర్
రాజనరసింహ, గీతారెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ ఆలి, ముఖేష్ గౌడ్,
సంపత్ కుమార్, డికె అరుణ, సర్వే సత్యనారాయణతో పాటు చాలామందే ఓడిపోయారు. ఇంతమంది
ఎందుకు ఓడిపోయారు ?
ఇపుడిదే ప్రశ్న అందరి బుర్రలను తొలిచేస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబునాయుడే అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు చేయకుండా ఒంటిరిగా పోటీ చేసుంటే ఎలాగుండేదో చెప్పలేం. కానీ అలా కాకుండా మహాకూటమిని కట్టి అందులోకి చంద్రబాబును కూడా తీసుకుంది. ఏపిలో బహిరంగసభల్లో మాట్లాడేటపుడు రాష్ట్ర విభజనను అన్యాయంగా చేసింది కాంగ్రెస్ అంటూ విమర్శిస్తుంటారు. తెలంగాణాకు వచ్చేటప్పటికీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు తాము మొదటి లేఖను ఇచ్చామని చెప్పారు. అంటే ఏ రోటికాడ ఆ పాట పాడారన్న మాట. ఆ విషయం జనాల దృష్టిలో పడకుండానే ఉంటుందా ?
ఇక, తెలంగాణా ద్రోహిగా చంద్రబాబును కెసియార్ బలమైన ముద్ర వేశారు. ముందస్తు ఎన్నికలకు సిఫారసు చేసిన దగ్గర నుండి కూడా తెలంగాణాలో చంద్రబాబు పెత్తనం అవసరమా అంటూ కెసియార్ జనాలను సూటిగా ప్రశ్నించిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే మహాకూటమి గెలిస్తే తెలంగాణాపై మళ్ళీ చంద్రబాబు పెత్తనమే మొదలవుతుందనే భావన జనాల్లో కలిగించటంలో కెసియార్ సక్సెస్ అయ్యారు. దానికితోడు ఏపిలో నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలన ఎంత సవ్యంగా సాగుతోందో అందరూ గమనిస్తూనే ఉన్నారు.
ఎలాగంటే, తెలంగాణా ఓటర్లలో సుమారు కోటిమంది సీమాంధ్రులే ఉన్నారు. ఇప్పటికే ఏపిలో చంద్రబాబు పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. తెలంగాణాలోని సీమాంధ్రులు ఏపికి రెగ్యులర్ గా రాకపోకలు సాగిస్తునే ఉన్నారు. ఏపిలోని తమ వాళ్ళ ద్వారా చంద్రబాబు పాలన గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటునే ఉన్నారు. వచ్చేసారి ఏపిలోనే చంద్రబాబు అవసరం లేదనుకుంటున్న సమయంలో తెలంగాణాలో అదే చంద్రబాబు పెత్తనం ఎందుకని అనుకున్నారు సీమాంధ్రులు. అందుకనే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్ గిరి, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్ పేట లాంటి చాలా నియోజకవర్గాల్లో మహాకూటమి అభ్యర్ధులు తుడిచిపెట్టుకు పోయారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టిడిపితో కలవకుండా ఉంటే కాంగ్రెస్ మరింత మెరుగైన ఫలితాలు సాధించేది అనే విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. నిజానికి కెసయార్ ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే, చంద్రబాబు మీదున్న వ్యతిరేకత ముందు కెసియార్ పై జనాల్లో ఉన్న వ్యతిరేకత చిన్నదైపోయింది. అందుకే మహాకూటమి తరపున చంద్రబాబు ఎక్కడెక్కడ ప్రచారం చేశారో అక్కడల్లా కూటమి అభ్యర్ధులు ఓడిపోయారు. అంటే చంద్రబాబుపై జనాల్లో ఎంత స్ధాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందో అర్ధమైపోతోంది. అంటే కాంగ్రెస్ చంద్రబాబుతో కలవటం ద్వారా పెద్ద తప్పు చేసి భారీ మూల్యం చెల్లించుకుందని అర్ధమైపోతోంది.