తెలంగాణలో కేసీఆర్ అద్భుతమైన విజయం పట్ల ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తెలంగాణలో ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ తో పాటు ఐదు రాష్ట్రాలలో గెలుపొందిన శాసన సభ్యులు అందరికీ అభినందనలు తెలిపారు ఏపీ సీఎం.


తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల తీర్పుపైనా చంద్రబాబు రియాక్టయ్యారు. దేశవ్యాప్తంగా బిజెపి బలహీనపడిందని చంద్రబాబు కామెంట్ చేశారు. గత 5ఏళ్లలో జరిగిన అనేక ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా, ఇప్పుడు తాజాగా జరిగిన 5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి పూర్తిగా బలహీనపడిందన్నారు. బిజెపి పాలన పట్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.



గత 5ఏళ్లలో బిజెపి చేసిందేమీ లేదనేది అన్నివర్గాల ప్రజలు గుర్తించారని చంద్రబాబు అన్నారు. అందుకే ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని.. బిజెపికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారని ఏపీ సీఎం కామెంట్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు 5రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.



తెలంగాణలో టీఆర్‌ఎస్ ఘన విజయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. కేసీఆర్ కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేసీఆర్ తో పాటు మిగిలిన రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థులకూ లోకేశ్ అభినందనలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: