తెలంగాణలో టీఆర్ఎస్ చరిత్రాత్మక విజయం సాధించింది. నాలుగింట మూడు వంతుల స్థానాలను తన ఖాతాలో వేసుకుని మరోసారి సత్తా చాటింది. ప్రతి జిల్లాలోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రమంతటా కారు జోరు మీద సవారీ చేసినా.. ఓ జిల్లాలో మాత్రం కారుకు బ్రేకులు పడ్డాయి.
అదే ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఈ జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉంటే.. టీఆర్ఎస్ కేవలం ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. గత ఎన్నికల్లో కేవలం కొత్తగూడెం స్థానంలోనే గెలిచిన టీఆర్ఎస్.. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ కు అప్పగించి.. ఖమ్మం స్థానంలో గెలిచింది. ఇక్కడ టీడీపీ నేత నామా నాగేశ్వరరావు పై టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు.
ఇక ఈ జిల్లాలో కాంగ్రెస్ జోరు కొనసాగింది. మొత్తం పది స్థానాల్లో ఆరు స్థానాలను తన ఖాతాలో వేసుకుని ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యపరిచింది. మధిరలో కాంగ్రెస్ అగ్రనేత భట్టి విక్రమార్క గెలిచారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి.. ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మట్టి కరిపించారు. కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఇల్లందుల్లోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. వైరాలో లావుడ్యా రాములు నాయక్ గెలవడం విశేషం.
ఇక టీడీపీ విషయానికి వస్తే.. రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే టీడీపీ ప్రభావం కనిపిస్తోంది. సత్తుపల్లి, ఆశ్వరావుపేటల్లో టీడీపీ గెలిచింది. సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవిపై గెలిచారు.