కాస్తో కూస్తో బలమున్న తెలంగాణాలోనే ఒకే ఒక్క సీటుని బీజేపీ గెలుచుకుంది. అక్కడ యోధానుయోధులు ఓడిపోయారు. ఆ పార్టీలో బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ లాంటి వారు పరాజయం పాలు అయ్యారు. మొత్తం 118 సీట్లకు పోటీ చేస్తే దక్కింది ఒకే ఒక్క సీటు. ఇక చాలా చోట్ల పార్టీకి డిపాజిట్లు కూడా పోయాయి. ఇంతటి దయనీయమైన స్థితిలో అక్కడ బీజేపీ ఉంటే ఇక ఏపీలో ఎలా ఉంటుందో మరి.
నైరాశ్యమేనా:
ఏపీ విషయానికి వస్తే బీజేపీకి పూర్తి నిరాశేనని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు ఉండబట్టి ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు దక్కారు. ఇపుడు సీన్ మారింది. టీడీపీ ఎడం జరగడంతో బీజేపీ ఒంటరిదైంది. ఆ పార్టీతో పొత్తుకు మిగిలిన మరే పార్టీ కూడా ఏపీలో ఇపుడు సిధ్ధంగా లేదు. సామాజిక వర్గాల సమీకరణలతో మ్యాజిక్ చేద్దామనుకున్నా అది కుదిరే వ్యవహారం కాదు. మునుపటి క్రేజ్ కూడా జనంలో లేదు. ఈ పరిస్తితుల్లో ఒంటరిగా పోటీకి వెల్తే బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదువరడం ఖాయమని అంటున్నారు.
మోడీ వస్తారట.
ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది అంటే జనవరి మొదటి వారంలో ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయన మీటింగ్ విశాఖలో కానీ, తాడెపల్లిగూడెంలో కానీ ఉంటుందని అంటున్నారు. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో మోడీ ఏపీకి వచ్చినా ఏం చేయగలరన్నది కూదా ప్రశ్నగానే ఉంది. ఏపీలో జనం బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారు.
ఆ పార్టీ విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా అంతకంటే ఇవ్వలేదు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తీసుకువచ్చింది, పెద్ద నోట్ల రద్దు వంటివి చేయడం వల్ల జనంలో వ్యతిరేకత బాగా ఉంది. అందువల్ల మోడీ వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ ఉండదని అంటున్నారు. మొత్తానికి తెలంగాణాలో డబుల్ డిజిట్ సాధించి ఏపీలో బలం పుంజుకోవాలని అనుకున్న బీజేపీ అక్కడ ఫలితాల తరువాత ట్రబుల్ లో పడింది.