‘ కాంగ్రెస్ పార్టీతో
పొత్తులు పెట్టుకుంటే జనాలు మమ్మల్ని బట్టలూడదీసి కొడతారు’..ఇది కొద్ది రోజుల క్రితం
చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సీనియర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన
వ్యాఖ్యలు. అప్పట్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. దాంతో
చింతకాయలను పిలిపించుకుని చంద్రబాబు క్లాస్ పీకి నోరు మూయించారు. తర్వాతెప్పుడో
చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నారు. తెలంగాణా ఎన్నికల్లో అంతా తానే
అయి ముందుండి నడిపించారు. ఏమైంది ?
సీన్ కట్ చేస్తే అప్పుడెప్పుడో చింతకాయల చెప్పిందే నిజమైంది. నిజంగానే తెలంగాణాలో ఓటర్లు తెలుగుదేశంపార్టికి బట్టలూడదీసేశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పాపానికి కాంగ్రెస్ కూడా బట్టలూడదీసుకోవాల్సొచ్చింది. చింతకాయల చెప్పింది బహుశా ఏపి గురించి అయ్యుంటుంది. కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన తెలంగాణా రాష్ట్రంలో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్, టిడిపిల విషయంలో చింతకాయల చెప్పిందే జరిగింది. అంటే ఇక మిగిలింది ఏపి ఎన్నికలే.
ఏపిలో కూడా చింతకాయల చెప్పిందే జరగటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాగంటే, నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై చాలా సామాజికవర్గాలు మండిపోతున్నాయి. పైగా అవినీతి విపరీతంగా పెరిగిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం తన సామాజికవర్గం ప్రయోజనాల కోసమే చంద్రబాబునాయుడు పరిపాలన చేస్తున్నారనే ప్రచారం ఎక్కువైపోయింది. దానికి తగ్గట్లే కమ్మ సామాజికవర్గం నేతల దాష్ఠీకాలు కూడా ఎక్కువైపోయాయి. దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ వ్యవహారశైలే అందుకు ఉదాహరణ. పెరిగిపోయిన అవినీతికి గురజాల ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ మరో ఉదాహరణ.
చంద్రబాబు పాలన మొదటి నుండి రెండు వర్గాల కోసమే అన్నట్లుగా సాగుతోంది. మొదటిది సొంత సామాజికవర్గం ప్రయోజనాలు కాపాడటం. ఇక రెండోది తన అవసరాలకు ఉపయోగపడే వారిని కాపాడుకోవటం. మొదటి ఖాతాలో సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి చాలా మంది నేతలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కనిపిస్తారు. ఇక రెండో ఖాతాలో సిఎం రమేష్, మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళుంటారు.
పై రెండు వర్గాలకు చెందని వారు కూడా ఉన్నారు. వారంతా అధికారులు. అంటే చంద్రబాబు ఎంత వీలుంటే అన్నీ వ్యవస్దలను భ్రష్టుపట్టించేశారు. రేపు గనుక పొరపాటున చంద్రబాబు అధికారం కోల్పోతే తర్వాత వచ్చే ప్రభుత్వం బయటపెట్టే విషయాలతో సామాన్యుల దిమ్మ తిరిగిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు. అవినీతి జరిగింది అనుకున్న ప్రతీ అంశంలోను భయంకరమైన వాస్తవాలు బయటపడే అవకాశాలున్నాయి ప్రభుత్వం మారితే. ఇవన్నీ చూచాయగా ఇఫుడే బయటపడ్డాయి. అందుకే తెలంగాణా ఎన్నికల్లో ఓటర్లు నిజంగానే తెలుగుదేశంపార్టీ బట్టలూడదీశారు. ఇక మిగిలింది ఏపి ఎన్నికలే.