తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ఓటర్లు
ఏ స్ధాయిలో తిరస్కరించారో తెలియటానికి చిన్న ఉదాహరణ. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో
పాటు ఖమ్మం, కోదాడల్లో ప్రచారం చేశారు.
మొత్తం 12 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేసి రోడ్డుషోలు చేస్తే మహాకూటమి
అభ్యర్ధులు 11 చోట్ల ఓడిపోయారు. ఓటమి కూడా అలా ఇలా కాదు ఘోరమైన ఓటమి. ప్రత్యర్ధులకు
బ్రహ్మాండమైన మెజారిటీ రావాలంటే చంద్రబాబు లేకపోతే నారా లోకేష్ ప్రచారం చేస్తే
చాలని తాజాగా టిఆర్ఎస్ నేతలు జోకులేసుకుంటున్నారు.
తెలంగాణా ఎన్నికల సందర్భంగా చంద్రబాబు వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఖమ్మం, కోదాడ, హైదరాబాద్ లో ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మలక్ పేట, ఎల్బీ నగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, సనత్ నగర్, ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో రోడ్డుషోలు నిర్వహించారు. అదే సమయంలో కొన్ని ఖమ్మం, కోదాడ లో బహిరంగ సభల్లో ప్రసంగించారు.
ఎక్కడ రోడ్డుషో చేసినా ఏ బహిరంగసభలో పాల్గొన్నా చెప్పిందొకటే. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానే. సైబరాబాద్ తన బ్రైన్ చైల్డ్. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు తానే నిర్మించానని ఒకటే ఊదరగొట్టారు. నిజానికి శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటైంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే చంద్రబాబు కోతలకు ఆకాశమే హద్దు కాబట్టి ఎన్నికల్లో నోటికొచ్చిదంతా చెప్పారు. సరే తన గొప్ప గురించి తాను ఎంత చెప్పుకున్నా ఓటర్లైతే ఏమాత్రం కరుణించలేదు. ఎవరి గొప్ప వాళ్ళే చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా అవుతుందని చంద్రబాబుకు తెలీదా ? తన గొప్పతనం గురించి పక్కవాళ్ళు చెప్పాలన్న జ్ఞానం కూడా చంద్రబాబులో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది.
చంద్రబాబు ప్రచారం చేసిన చాలా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ అభ్యర్ధులకు భారీ మెజారిటీ రావటం గమనార్హం. కుకట్ పల్లిలో సుహాసిని టిఆర్ఎస్ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు చేతిలో 41 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. శేరిలింగంపల్లిలో తనకు అత్యంత సన్నిహితుడు భవ్యా ఆనందప్రసాద్ కు చంద్రబాబు టిక్కెట్టిచ్చారు. ప్రత్యేకంగా భవ్య కోసమే రోడ్డుషోల్లో పాల్గొన్నారు. ఇక్కడ కూడా భవ్య టిఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో 44 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజేంద్రనగర్ లో అయితే టిఆర్ఎస్ అభ్యర్ధికి ఏకంగా 58 వేల ఓట్ల మెజారిటీ రావటం ఆశ్చర్యం.