తమకు ఉన్న బలాన్ని అంచనా వేయడంలోను, అసలు ఏమీ లేని... ఉనికిలోనే లేని పార్టీ నాయకుడు తమకేదో సీఎం సీటును తెచ్చి చేతిలో పెడతాడని లెక్కలు కట్టడంలోనూ తెలంగాణా కాంగ్రెస్ నేలమట్టమైంది. నిజానికి కేసీఆర్పై ఆది నుంచి యుద్ధం చేసింది కాంగ్రెస్ మాత్రమే. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేసీఆర్కు కంటిపై కునుకు లేకుండా చేసింది కూడా కాంగ్రెస్ నేతలే. ఇక, ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకొన్నారు. మీరెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు? అని మీడియా కేసీఆర్ను ప్రశ్నించినప్పుడు.. ``ఈ కాంగ్రెస్ సన్నాసులు.. ప్రతి పనికీ అడ్డుపడుతున్నారు. నీళ్ల కాడ.. గోతికాడ.. కూడా కోర్టుకెక్కతున్నారు. వీళ్ల పీడ వదిలించుకునేందుకే ముందస్తుకు పోతున్నం. ఉంటే నేనైనా ఉండాలె., కాకుంటె వాళ్లయిన రావెల``- అని చెప్పారు.
అంటే సుస్పష్టంగా కేసీఆర్ ఎవరికి భయపడ్డారో.. ఎవరు తనకు కంట్లో నలుసుల్లా మారారని అనుకుని ఎన్నికలకు వెళ్లా రో చిన్నపిల్లాడికి కూడా అర్ధమైంది. కానీ, తెలంగాణాలోని కాంగ్రెస్ నేతలకు మాత్రం అర్ధం కాలేదు. ఫలితంగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో కూడా తెలియక అల్లాడిపోతున్నారు. మరి ఇంతగా నేతలు చేతులు కాల్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఏ కారణంపై ఎన్నికలు ప్రారంభమయ్యాయో.. అది పోయి.. సెంటిమెంటు క్రీడ ఎందుకు తెరమీదికి వచ్చింది? అనేది ఇప్పుడు ప్రధాన విశ్లేషణకు కారణమైంది. తమ బలాన్ని అంచనా వేసుకోకుండా టీడీపీతో జట్టు కట్టి రాగాలు తీయడం, చంద్రబాబును హీరోను చేయడమే ఇప్పుడు తెలంగాణా నాయకులకు తలలు తీసేసింది. నిజానికి ఈ స్థాయిలో వారి పరాజయం ఉంటుందని నాయకులు కూడా ఊహించి ఉండరు. అటు ఓట్లు, ఇటు సీట్లు కూడా కోల్పోయి.. తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.
2014లో కాంగ్రెస్ ఓటు షేర్ 28% కన్నా ఎక్కువ.. మరి ఇప్పుడు 25% కన్నా తక్కువకు దిగజారింది. గెలుపు నాదే అని భావించిన రేవంత్ రెడ్డి, జానా, జేజమ్మ అరుణ, గీతా రెడ్డి.. వంటి మహామహులు సైతం మట్టి కరిచారు. నిజానికి వీరంతా తెలంగాణా కోరుకున్న వారే! కానీ, ప్రజలు వీరిని పక్కన పెట్టేశారు. బహుశ ఇప్పట్లో వీరు ప్రజల్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోయింది. కేసీఆర్ ప్రజా వ్యతిరేకతా అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లకుండా చంద్రబాబు జిమ్మిక్కులను నమ్ముకుని వీరంతా పనిచేయడమే పెద్ద మైనస్గా మారిపోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ప్రతిపక్షంలో ఉన్నవారిపై సానుభూతి ఉంటుంది. కానీ, అది కూడా లేకపోయిన ఈ నేతల ఫ్యూచర్ ఇప్పట్లో బాగు పడడం కష్టమే అంటున్నారు పరిశీలకులు.
కేసీఆర్ వ్యూహాన్ని మార్చుకున్నప్పుడు అయినా.. కాంగ్రెస్ కళ్లు తెరిచి ఉంటే పరిస్థితి బాగుండేది. కానీ, ప్రజల్లో ప్రభు త్వ వ్యతిరేకత ఉందని చిట్ట చివరి వరకూ నమ్మడం, సెంటిమెంటును అస్త్రంగా చేసుకున్న కేసీఆర్ను తక్కువగా అంచనా వేసి.. ఆయన శత్రువు.. కేసీఆర్ చెప్పినట్టు.. హైదరాబాద్నుంచి తరిమి కొట్టబడిన నాయకుడిని తెచ్చి భుజా లపై ఎక్కించుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద పొరపాటు! అదేసమయంలో వైఎస్ హయాంలోను, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనూ చేసిన హైదరాబాద్ అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోవడం, దీనిని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటే చూస్తూ.. చప్పట్లు కొట్టడం.. వంటివి కాంగ్రెస్ను నిలువునా ముంచేశాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే నిర్మించానని చెప్పారు చంద్రబాబు.
కానీ, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో వైఎస్ అడ్డగోలుగా ప్లాన్ మారుస్తున్నారని అసెంబ్లీలో ఎవరు గోల చేశారో చెప్పి ఉంటే బాగుండేది! దీనిని బట్టి ఎవరు రోడ్డు వేశారో ప్రజలు అర్ధం చేసుకునేవారు. షంషా బాద్ ఎయిర్ పోర్టును తానే నిర్మించానన్న చంద్రబాబును కూడా కాంగ్రెస్ నిలువరించలేదు. దీనికి శంకు స్థాపన చేసింది బాబు కావొచ్చు. కేంద్రం నుంచి అనుమతులు తెచ్చి.. నిధులు సేకరించి పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్లేలేదు. ఇలా తమ బలం మరిచిపోయి.. బలహీనుడైన (తెలంగాణాలో) బాబుపై ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ చేసింది మూసీలో మునగడమే!!