తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే తాను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలనుకున్నానని అందరికీ షాకిచ్చారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రికేయుల సమావేశంలో. కొత్త రాష్ట్రం ఏర్పాడ్డక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా మాట తప్పారని అన్న సందర్భంలో - దానిని ఖండిస్తూ ఆ మాటల్లో నిజం లేదన్నారు. కేసీఆర్ మాటలు విన్న పాత్రికేయులతో పాటు టీఆర్ఎస్ నేతలు ఒకసారిగా షాకయ్యారు. మీడియాతో చిట్చాట్ లో భాగంగా కేసీఆర్ ఈ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
ఆరు దశాబ్ధాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, ఏర్పడ్డాక తాను నాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని డిల్లీ వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశానని నాలుగున్నరేళ్ల కిందటి విషయాలను గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సోనియా గాంధి తనను కోరినట్లు వెల్లడించారు. అయితే టీఆర్ఎస్ ను విలీనం చేసినా కాంగ్రెస్కు ప్రయోజనం ఉండదని సోనియా గాంధి కి చెప్పానన్నారు. మా పార్టీని విలీనం చేస్తానని, అయితే "తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి" గా తననే నియమించాలని కోరగా, సోనియా గాంధి అందుకు అభ్యంతరం తెలిపినట్లు కేసీఆర్ ఆసక్తికర విషయాలను పాత్రికేయులతో చిట్-చాట్ లో షేర్ చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక "టీఆర్ఎస్ ఉనికే ఉండదని" అవమానించారని తెలిపారు. అంతే కాదు నాడు టీఆర్ఎస్ లో ఉన్న విజయశాంతితో పాటు పలువురు టీఆరెస్ నేత లను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని పేర్కొన్నారు. ఆ విధంగా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేసి గెలిచినా, ఆ ఎన్నికల్లో తాను ఊహించిన సీట్లు గెలుచుకోలేక పోయామని చెప్పారు.