మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారు. వెంకటరెడ్డి మళ్ళీ పోటీకి
రెడీ అవటం ఏంటనుకుంటున్నారా ? అయితే కథనం
చదవాల్సిందే. మొన్నటి ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో పోటీ చేసిన కోమటిరెడ్డి
వెంకటరెడ్డి చిత్తుగా ఓడిపోయారు. నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమిని ఎవ్వరూ
ఊహించలేదు. వెంకటరెడ్డి నల్గొండలో పోటీ చేస్తే తమ్ముడు రాజగోపాలరెడ్డి మునుగోడు
నుండి పోటీ చేశారు. నామినేషన్ వేయకముందు నుండి కూడా మెజారిటీ ఎంతన్నదే
సోదరులిద్దరూ లెక్కలేసుకున్నారు. కనీ అనూహ్యంగా వెంకటరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్ధి
కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఎప్పుడైతే వెంకటరెడ్డి ఓడిపోయారో వెంటనే సోదరుడు రాజగోపాలరెడ్డి పావులు కదిపారు. ఎలాగూ త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. మొన్నటి అసెంబ్లీలో పడిన దెబ్బకు రేపటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారో తెలీకుండా ఉంది. ఎన్నికలేమో మరో ఆరుమాసాల్లోకి వచ్చేసింది. దాంతో నల్గొండ నుండో లేకపోతే భువనగిరి లోక్ సభ నుండో పోటీలోకి దిగాలని బ్రదర్స్ నిర్ణయించుకున్నారు. రాజగోపాలరెడ్డి అయితే భువనగిరి నుండి ఎంపిగా కూడా పనిచేశారు. కానీ వెంకటరెడ్డి నల్గొండ నుండి ఎంఎల్ఏగానే ఉంటున్నారు.
తాజా ఎన్నికల్లో నల్గొండలో ఓడిపోవటంతో వెంకటరెడ్డి బహుశా నల్గొండ నుండే ఎంపిగా పోటీలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఎంపిగా పోటీ చేసే అవకాశం రావటం నిజంగా లక్కనే చెప్పాలి. మొత్తానికి రాజగోపాలైతే తన సోదరుడు ఎంపిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించేశారు. కాంగ్రెస్ లో చాలామంది నేతల ఇష్టమే ఎక్కడ పోటీ చేయాలన్నది. మరి ఎంపిగా పోటీ చేసే విషయం వెంకటరెడ్డికే పరిమితమవుతుందా ? లేకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారంతా మళ్ళీ పార్లమెంటు ఎన్నికలకు దిగుతారా అన్నది చూడాల్సిందే.
మొన్నటి ఎన్నికల్లో సీనియర్లు జానారెడ్డి, జీవన్ రెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, రేవంత్ రెడ్డి, నాగం జనార్ధనరెడ్డి, సుదర్శనరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లాంటి సీనియర్లు చాలామందే తుడిచిపెట్టుకుని పోయారు. దశాబ్దాల పాటు పదవులకు అలవాటు పడిపోయిన ప్రాణాలు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు మాసాలకే పార్లమెంటు ఎన్నికలు వస్తుండటం నిజంగా ఇటువంటి సీనియర్లకు లక్కనే చెప్పాలి. మరి ఎంతమంది మళ్ళీ పోటీకి సై అంటారో చూడాల్సిందే.