ఏపీ రాజకీయాల్లో కూడా ఆ రెండు పార్టీలు కలిసే వస్తాయట. తెలంగాణా ఫలితాలతో సంబంధం లేకుండా ఏపీలో గెలిచి తీరుతామని కూడా చెబుతున్నారు. జాతీయ స్థాయిలో అవసరాలు, ఏపీలో సమీకరణల ద్రుష్ట్యా కలసి నడవడం అనివార్యమని ఆ పార్టీలలో కొందరి మనోగతంగా ఉంది.
కాంగ్రెస్ విజయాలు:
నిజానికి తెలంగాణా ఫలితాలు వచ్చీ రాగానే టీడీపీ అధినాయకత్వం కాంగ్రెస్ పై ఓ రేంజిలో విరుచుకుపడిపోవాలి. ఆ పార్టీ వల్లనే అంతా జరిగిందని, ఈ పొత్తు చారిత్రాత్మక తప్పిదమని కూడా కడిగి పారేయాలి. కానీ అలా జరగలేదు. చంద్రబాబు సైతం మౌనంగా ఉంటున్నారు. అందుకు కారణాలు పరిశీలిస్తే ఉత్తరాదిన వచ్చిన ఫలితాలే అంటున్నారు. అక్కడ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు కేంద్రంలో బలమైన పార్టీగా కాంగ్రెస్ మాత్రమే నిలుస్తుంది. ఎటూ బీజేపీతో చెడిన కారణంగా టీడీపీకి జాతీయ స్థాయిలో మరో అండ కావాలి. దానికి తోడు కాంగ్రెస్ వేగంగా పుంజుకోవడం చూసిన చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.
సీనియర్ల సణుగుడు:
అయితే టీడీపీలో సీనియర్లు కొందరు మాత్రం బయటకు చెప్పలేకపోయినా లోలోపల సణుగుతున్నారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తును తెలంగాణా ప్రజలు ఆమోదించలేదని, అందువల్ల ఇక్కడ కూడా కలసి నడవడం వల్ల ఇబ్బదులే వస్తాయని అంటున్నారు. అయితే వారు ధైర్యం చేసి అధినాయకత్వం ముందు తమ భావాలను మాత్రం చెప్పలేకపోతున్నారు. మరో వైపు ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమి ఇక్కడ కూడా పోటీకి దిగుతుందని అంటున్నారు ఏపీలో వారి అవసరం అలా వుంది మరి.
కలిసే వుంటాం:
ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలిసే పోటీకి దిగుతాయని డిల్లీకి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు సంకేతాలు ఇస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తో తమ ప్రయాణం ఆగేది కాదని, ఏపీలో విడిగా పోటీ చేస్తే రెండు పార్టీలకూ నష్టమేనని కూడా అంటున్నారు. గతంలో 2.5 ఓట్ల శాతం వచ్చిన కాంగ్రెస్ కి ఈసారి అయిదారు శాతం ఓట్లు ఏపీలో వస్తాయని కూడా చెబుతున్నారు. అదే టైంలో బీజేపీ, పవన్ పార్టీలు విడిపోవడం, ప్రజా వ్యతిరేకత వల్ల టీడీపీ ఓట్ల శాతం తగ్గిందని కూడా అంటున్నారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి పొత్తులు అనివార్యమని చెప్పుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.