అవును క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మహాకూటమి తరపున గెలిచిన ముగ్గురు ఎంఎల్ఏలు తొందరలో టిఆర్ఎస్ లో చేరటానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలోని ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే మహాకూటమి ఓటు ట్రాన్సఫర్ చక్కగా జరిగింది. ఈ జిల్లాలో కాంగ్రెస్ 6 నియోజకవర్గాల్లో గెలిచింది. టిడిపి రెండు చోట్ల గెలిచింది. ఒక నియోజకర్గంలో టిఆర్ఎస్ గెలవగా మరోచోట ఇండిపెండెంట్ గెలిచారు. అంటే రాష్ట్రం మొత్తం పారిన కెసియార్ మంత్రాంతం ఖమ్మంలో మాత్రం పారలేదని స్పష్టమవుతోంది. దాంతో ముఖ్యమంత్రి కాగానే కెసియార్ ఈ జిల్లాపైనే ప్రధానంగా దృష్టి పెట్టారట.
కెసియార్ దృష్టిపెట్టటమంటే ఏముంది ? ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపటమే. అలవాటైన విద్యే కదా ? వెంటనే రంగంలోకి దిగిపోయారు. నమ్మకమైన నేతలను రంగంలోకి దింపి గెలిచిన ఎంఎల్ఏలకు గాలమేయటం మొదలుపెట్టారు. ముందుగా వైరాలో ఇండిపెండెంట్ గా గెలిచిన రాములు నాయక్ గాలానికి తగులుకున్నారు. గెలిచిన రెండోరోజే కెసియార్ కు జిందాబాద్ కొట్టేశారు. ఎలాగూ ఇండిపెండెంటే కాబట్టి రాములు టిఆర్ఎస్ లో చేరినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ మిగిలిన ఎంఎల్ఏల మాటేమిటి అన్నదే ప్రశ్న.
అందుకే తర్వాత గాలం సత్తుపల్లి, అశ్వారావుపేటలో టిడిపి తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులపై విసిరారట. వీరిద్దరిలో సండ్రకు పార్టీ మారాల్సిన అవసరం చాలా ఉంది. ఓటుకునోటు కేసులో ఇరుక్కుని 14 రిమాండ్ కు కూడా వెళ్ళి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసులో నుండి బయటపడాలంటే కెసియార్ కు సరెండర్ అవ్వటమొక్కటే సండ్రకున్న ఏకైక దారి. కెసియార్ గనుక కేసును బిగించేస్తే సండ్ర పరిస్దితి అంతే సంగతులు. ఈ ఐదేళ్ళు కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరుగుతుండాల్సిందే. పైగా గెలిచిందేమో టిడిపి తరపున. ఉన్నదే ఇద్దరు ఎంఎల్ఏలు.
పోనీ మహాకూటమి అయినా అవసరానికి ఆదుకుంటుందా అంటే అది కూడా డౌటే. ప్రతిపక్షం బలంగా ఉన్న రోజుల్లోనే కెసియార్ ఎవరినీ లెక్క చేయలేదు. ఇఫుడు ప్రతిపక్షం అన్నదే పూర్తిగా దెబ్బ తినేసింది. కాబట్టి మహాకూటమిని నమ్ముకునేకన్నా కెసియార్ నే నమ్ముకుంటే కనీసం కేసులో నుండైనా బయట పడొచ్చని సండ్ర అనుకుంటే అది ఆయన తప్పు కాదు. ఇక కాంగ్రెస్ తరపున కొత్తగూడెంలో ఎన్నికైన వనమా వెంకటేశ్వరరావు పేరు కూడా వినిపిస్తోంది. ఇల్లెందు, భద్రాచలం, పినపాక, పాలేరు ఎంఎల్ఏలు కూడా కారెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఒక్క మధిర ఎంఎల్ఏ బట్టి విక్రమార్క పేరు మాత్రమే వినపడటం లేదు.
జిల్లాలో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆరుమంది ఎంఎల్ఏలు చేయగలిగింది కూడా ఏమీ లేదు. వాళ్ళందరికీ పార్టీపై ప్రత్యేకమైన ప్రేమ ఏముంటుంది ? ఒకవేళ పార్టీపై అభిమానం ఉన్నా కెసియార్ ఒత్తిళ్ళను తట్టుకుని ప్రతిఘటించే శక్తి ఉందా అన్నది అనుమానమే. మొన్నటి వరకూ జరిగిన వ్యవహారాలను చూస్తే ఒత్తిళ్ళను తట్టుకునే శక్తి ఎక్కువమందికి ఉండదనే అనుకోవాలి. కాబట్టి త్వరలో కనీసం నలుగురు ఎంఎల్ఏలు కారెక్కే అవకాశాలను కొట్టిపారేయలేం. మరేం జరుగుతుందో చూద్దాం.