ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత పై హత్యాయత్నం జరిగిన కేసులో అటు ఆ రాష్ట్ర ప్రభుత్వమూ ఇటు కేంద్రప్రభుత్వం సరిగా స్పందించక పోవటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ నివేదిక పై హైకోర్టు మండిపడింది. సీల్డ్ కవర్ నివేదిక సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి (Central Industrial Security Force -CSIF) హైకోర్టు ఆదేశాలు జారీచేస్తూ, విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.
ఇకపోతే విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహనరెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటన పై జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్ఐఏ తో దర్యాప్తు చేయించే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. హత్యాయత్నం జరిగిన ప్రాంతం ఎన్ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధి లోకి వస్తుందో? రాదో? పరిశీలన చేసి, ఆ తరువాత దర్యాప్తు పై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని కూడా వివరించింది.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఎన్ఐఏ దర్యాప్తు పై ఏ నిర్ణయం తీసుకున్నా, బహిర్గతం చేయకుండా సీల్డ్ కవర్ లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ లో పంపిన నివేదికపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ పూర్తిస్థాయి నివేదిక పంపాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం పంపిన సీల్డ్ కవర్ నివేదిక విషయం లో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని వైఎస్ జగన్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తెలిపారు. ఈ నెల 21లోగా మళ్లీ నివేదిక ఇవ్వాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించదని చెప్పారు. "శుక్రవారంలోగా కేసును మీరు ఎన్ఐఏకు బదిలీ చేస్తారా? లేక మమ్మల్నే బదిలీ చేయమంటారా?" అని కూడా కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించిందని చెప్పుకొచ్చారు.