కేసీఆర్ తెలంగాణ లో గెలిచిన అనందం తో ఆంధ్ర కు వచ్చి ప్రచారం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే . అయితే కేసీఆర్ తో సాంగత్యం అంటే.. దాంతో లాభం ఏమిటో కానీ.. తెలుగుదేశం పార్టీ తన అస్త్రాలను ఉపయోగించుకుని మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుందని ఎవరికీ తెలియనిది కాదు. అందుకే.. కేసీఆర్ తో తమకు సంబంధం లేదని, కేసీఆర్ విజయంతో తాము పొంగిపోవడం లేదు అని.. అసలుకు కేసీఆర్ ఏపికి ద్రోహమే చేశాడని, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు విషయంలో రాజీపడకుండా ఉంటే.. ఏపీకి కూడా చంద్రబాబు పీడ ఇప్పటికే వదిలేది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నాడు.
తమ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుంది అని, ఎవరి పొత్తునూ, సహకారాన్ని తాము కోరడంలేదు అని బొత్స స్పష్టంచేశాడు. ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశాడు. తెలంగాణలో గెలిచిన ఆవేశంలో ఏపీలో ప్రచారం చేస్తానని కేసీఆర్ ప్రకటించాడు. అలాగే ఏపీలో జగన్ కోసం ప్రచారం చేస్తానని ఒవైసీ కూడా ప్రకటించాడు. అయితే వైసీపీ మాత్రం ఈ సాయాలు తమకు అవసరం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఈ అంశాలను తనకు అనుకులంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ కు జగన్ కు సంబంధం అంటగడుతూ టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.
అవతల చంద్రబాబు నాయుడేమో తను కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాను అని అయితే ఆయన కలిసిరాలేదని ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల ముందు చంద్రబాబు అదే ప్రకటన చేశాడు, ఇప్పుడూ ఆ మాటే చెబుతున్నాడు,. కేసీఆర్ స్నేహానికి ఒప్పుకోనందుకు బాబు చాలానే ఫీలవుతున్నట్టుగా ఉన్నాడు. బాబు మాటలు అలా ఉంటే.. కేసీఆర్ తో జగన్ స్నేహం అంటూ తెలుగుదేశం నేతలు అంటున్నారు. తను కేసీఆర్ స్నేహాన్ని మిస్ అయ్యానని చంద్రబాబు నాయుడు బాధపడుతున్న విషయాన్ని దాచేస్తూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ విషయాలను బొత్స ప్రస్తావించాడు.