తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి టీడీపీ కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ఏపీలోనూ తెలంగాణ తరహా తీర్పు వస్తుందేమో అన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. అందుకే ప్రతిపక్ష వైసీపీపై దాడి తీవ్రం చేసింది. జగన్ను కేసీఆర్ ఫ్రెండ్ గా ప్రచారం పెంచుతోంది. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం ఆ రాష్ట్రంలో సెంటిమెంట్ పెంచింది.
ఇప్పుడు టీడీపీ కూడా అదే ప్లాన్ అమలు చేస్తోంది. జగన్- కేసీఆర్ స్నేహితులన్న కోణాన్ని సాధ్యమైంత బాగా ఎస్టాబ్లిష్ చేసి జగన్ను రాష్ట్ర ద్రోహిగా ప్రచారం చేయాలని సంకల్పించింది. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు , మంత్రి కిమిడి కళావెంకట్రావు ఇదే కోణంలో వైఎస్ జగన్కు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన కేసీఆర్ గెలుపు పట్ల వైసీపీ సంబరాలు చేసుకోవటమేంటని ఆ లేఖలో నిలదీశారు.
తెలంగాణలో వైసీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎంపీ, ఎమ్మెల్యేల విషయంలో గవర్నర్కు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. 2016లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్ధతివ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పింది వాస్తవం కాదా..? అని తన లేఖలో ప్రశ్నించారు. ఎన్నికల ముందు మీ పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి రహస్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులతో మంతనాల ఆంతర్యమేంటో మీడియాకు వివరించాలన్నారు.
కూకట్పల్లి టీఆర్ఎస్ శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు తన గెలుపుకోసం కృషి చేశారంటూ వైసీపీ అధ్యక్షుడు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెబుతూ బహిరంగ ప్రకటన చేయడమే టీఆర్ఎస్- వైసీపీ దోస్తీకి సాక్ష్యమని కళా వెంకట్రావు అంటున్నారు. అసదుద్దీన్ జగన్ను బలపర్చటమంటే.. వైసీపీ బీజేపీతో లాలూచీ పడటమేనని వ్యాఖ్యానించారు. 2014లో తెలంగాణలో పోటీ చేసి, 2018లో మాదే అధికారం అని మీ పార్టీ నేతలు ప్రగల్భాలు పలికి పోటీ చేయకుండా ఎందుకు జంప్ అయ్యారో ప్రజలకు వివరణ ఇవ్వాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.