తెలంగాణలో ప్రజాకూటమికి ఘోర పరాజయం ఏపీ సీఎం చంద్రబాబులో నిర్వేదం నింపింది. తెలంగాణ ఎన్నికల్లో కూటమిని గెలిపించి.. కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్న ఆయన.. ఇప్పుడు టీఆర్ఎస్ ఘన విజయంతో అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నారు. తెలంగాణలో చంద్రబాబును ఘోరంగా తిరస్కరించడం వల్ల అదే పరిస్థితి రేపు ఆంధ్రా ఎన్నికల్లో ఎదురైతే ఎలా అని మథనపడుతున్నారు.
అసలే ఓవైపు కేసీఆర్ భయం చంద్రబాబును వెంటాడుతుంటే.. మరోవైపు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సైతం చంద్రబాబును భయపెడుతున్నారు. చంద్రబాబు తన ప్రాంతానికి వచ్చి ప్రచారం చేసినందువల్ల తాను కూడా ఏపీ వెళ్లి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి తీరతానని ఢంకా భజాయిస్తున్నారు. అదే జరిగితే టీడీపీ నమ్ముకున్న మైనారిటీ ఓట్లకు గండిపడటం ఖాయం.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్, పవన్ కారణంగా పోటీ రసవత్తరంగా మారింది. ఏ ఒక్కసామాజిక వర్గాన్నిదూరం చేసుకున్నా కష్టమే. అలాంటి సమయంలో అసదుద్దీన్ ప్రచారం కారణంగా మైనారిటీలు టీడీపీకి దూరమైతే.. ఆ ప్రభావం టీడీపీ విజయంపై పడటం ఖాయం. అందుకే మైనారిటీల్లో విశ్వాసం నింపేందుకు టీడీపీ చర్యలు చేపడుతోంది.
అసదుద్దీన్ విమర్శలను తిప్పికొడుతోంది. సిద్దాంతపరంగా బిజెపికి మజ్లిస్ వ్యతిరేకమని, అలాంటి బిజెపికి సహకరిస్తున్న జగన్ కు ఎమ.ఐ.ఎమ్ ఎలా మద్దతు ఇస్తుందని ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ సిద్ధాంతాలను పక్కనపెట్టి భాజపా బలపడేలా చేస్తారా అని ప్రశ్నించారు. ఇంతకాలం బిజెపితో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, ఎలాగొలా బిజెపిని వైసిపికి అంటగట్టి రాజకీయ లబ్ది పొందాలని తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యూహం ఎంతగా ఫలిస్తుందో చూడాలి.