అవును చంద్రబాబునాయుడు వైసిపి, జనసేనలపైకి జనాలను
రెచ్చ గొడుతున్నారు. చంద్రబాబు దగ్గర మొదటి నుండి ఓ అలావాటుంది. తాను మాత్రం ఏ
పార్టీతో అయినా పొత్తులు పెట్టుకోవచ్చు. ఎన్నిసార్లైన విడిపోయి మళ్ళీ అవసరం కోసం
అతుక్కోవచ్చు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎవరూ ఎవరితో కూడా పొత్తుపెట్టుకోడదు. అంటే
తాను చేస్తే సంసారం పరాయివాళ్ళు చేస్తే వ్యభిచారం అని ఒకటే ఊదరగొట్టేస్తారు. సరే
తన మాటలకు బాకాలూది ప్రచారం చేసే మీడియా ఉన్నంత వరకూ చంద్రబాబు ధోరణి మారదనుకోండి
అది వేరే సంగతి.
ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా ఎన్నికల్లో తలబొప్పి కట్టిన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా మాట్లాడుతున్నారు. కెసియార్ కొట్టిన దెబ్బ చంద్రబాబు మీద బాగా ప్రభావం చూపినట్లే కనబడుతోంది. కెసియార్ కు ఏపిలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ మద్దతు పలకటం ఎంత వరకూ న్యాయమో చెప్పాలంటూ జనాలను అడుగుతున్నారు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్న కెసియార్ కు జగన్, పవన్ మద్దతుపలకటం ద్వారా ఏపికి వైసిపి, జనసేన పార్టీలు అన్యాయం చేస్తున్నాయంటూ మండిపడుతున్నారు.
చంద్రబాబు మాటలు వింటుంన్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్ కానీ లేకపోతే పవన్ కానీ తాము టిఆర్ఎస్ తో పొత్తు రాబోయే ఎంపి ఎన్నికల్లో పెట్టుకుంటున్నట్లు గానీ లేకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని కానీ ప్రకటించలేదు. కనీసం ప్రయత్నించినట్లు కూడా ఎక్కడా ఆధారాలే కనబడలేదు. అదే సమయంలో చంద్రబాబు మాత్రం కెసియార్ తో పొత్తుకు ప్రయత్నించి అవమానపడ్డారు. ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ఇఫ్పటికి ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకుందామని తాను ప్రయత్నిస్తే కెసియార్ చీ కొట్టినట్లు ఎన్నోసార్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
పేరుకే రెండు రాష్ట్రాల అభివృద్ధి అంటున్నారు చంద్రబాబు. బిచాణ ఎత్తేసిన తెలంగాణాలో మళ్ళీ టిడిపి జెండాను ఎలాగైనా ఎగరేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం. ఆ విషయం గ్రహించిన కెసియార్ అందుకు అవకాశం ఇవ్వలేదు. దాంతో భంగపడిన తర్వాతే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నారు. సరే తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
ఏపి ఎన్నికల్లో వైసిపితో పొత్తుపెట్టుకుని ఏపిలో కూడా కెసియార్ ఎక్కడ అడుగుపెడతారో అన్న భయమే చంద్రబాబులో కనబడుతోంది. అందుకనే ముందు జాగ్రత్తగా కెసియార్ కు జగన్, పవన్ మద్దతంటూ ఊదరగొడుతున్నారు. ఎలాగైనా సరే పై రెండు పార్టీలతో కెసియార్ పొత్తులు పెట్టుకోకుండా చేయటమే చంద్రబాబుకు కావాల్సిందే. వైసిపికి సంబంధించి పొత్తులంటూ గతంలో కూడా కొద్ది రోజులు బిజెపితోను తర్వాత కాంగ్రెస్ తోను ఎన్ని విమర్శలు చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది.
చంద్రబాబు మాత్రం యధేచ్చగా బిజెపితో పొత్తు పెట్టుకోవచ్చు. తర్వాత విడాకులు తీసుకుని కాంగ్రెస్ తో నూ కలవచ్చు. చంద్రబాబు ఎవరితో కలిసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. అదే ఇకేదైనా పార్టీ ఎవరితోనైనా కలుస్తోందంటే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకే అంటారు. చంద్రబాబు లాజిక్ ఎలాగుందో చూస్తున్నారుగా ? మరి ఇటువంటి అర్ధం లేని లాజిక్కులకు ఎప్పుడు తెరపడుతుందో చూడాల్సిందే.