ఛత్తీస్గఢ్లో బంపర్ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ సీఎం ఎంపికలో మాత్రం తీవ్రంగా కిందా మీదా పడింది. చివరకు పీసీసీ అధ్యక్షుడు భూపేష్ బఘెన్కు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సాయంత్రం భూపేష్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఒక్కరే ప్రస్తుతానికి ప్రమాణం చేస్తారు. ఐతే భూపేష్ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది.
కుర్మీ వర్గానికి చెందిన భూపేష్.. పార్టీని పునరుజ్జీవింప చేసిన నేతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2013లో మావోయిస్టుల దాడిలో పార్టీకి చెందిన అగ్రనేతలంతా మూకుమ్ముడిగా హత్యకు గురైన సమయంలో భూపేశ్ పార్టీకి అండగా నిలిచారు. క్యాడర్ లో ఆత్మస్థైర్యం నింపు విజయం దిశగా అడుగులు వేయించారు.
భూపేష్ ధైర్యంగా ముఖ్యమంత్రి రమణ్సింగ్, మంత్రులపై విమర్శలతో దూకుడు ప్రదర్శించేవాడు. దీని కారణంగా ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. వాటిలో సెక్స్ సీడీ వివాదం ఒకటి. ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు కూడా సాగుతోంది. భూపేష్, పాత్రికేయుడు వినోద్ వర్మలపై సీబీఐ సెప్టెంబర్లో చార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఈ కేసు సమయంలో తాను నిర్దోషినని గట్టిగా వాదించిన భూపేష్.. బెయిల్ తీసుకునేందుకు ఒప్పుకోలేదు. జైల్లో పెడితే అక్కడే దీక్ష చేస్తానన్నారు. అన్నట్టుగానే చేసారు. ఆ తర్వాత కొన్ని రోజులకు విడుదలయ్యారు. ఇదంతా బీజేపీ తనపై పన్నిన కుట్ర, కక్షసాధింపుగా భూపేష్ బాగా ప్రచారం చేసుకున్నారు. మొత్తానికి ఆ సానుభూతి బాగానే వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా ఛత్తీస్గఢ్ సీఎం కాబోతున్నారు భూపేష్. రాహుల్ గాంధీ కూడా దీన్ని కక్షసాధింపు కేసుగానే భావించడంతో ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు.