ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్తుండగా కోదాడ మండలం దొరకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఏపీ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ వద్ద పీఎస్ గా పని చేస్తున్న భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రంగా గాయపడ్డ విజయలక్ష్మిని ఖమ్మం ఆసుపత్రికి, మరో వ్యక్తి పాపయ్యను నకిరేకల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తాజాగా ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, వారికి అన్నివిధాలా అండగా ఉండి, ఆదుకుంటామని హామీ ఇస్తున్నానని ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ ఘటనతో ఏపీ సచివాలయంలో విషాదం నెలకొంది.