వైఎస్ జగన్కు తండ్రి ఇచ్చిన పెద్ద వరం సాక్షి మీడియా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సాక్షి మీడియా లేకపోతే.. జగన్ తండ్రి మరణం తర్వాత ఇంతకాలం జనం నోళ్లలో ఉండే అవకాశం ఉండేది కాదు. తెలుగులో ప్రధాన ప్రింట్ మీడియా యెల్లో మీడియాగా మారిన సమయంలో సాక్షి మీడియా ద్వారా జగన్ వాయిస్ జనంలోకి వెళ్తోంది.
ఇంతవరకూ బాగానే ఉన్నా.. సాక్షి మీడియా జగన్ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా పనిచేయడం లేదన్న వాదనలు కొన్నాళ్లుగా జగన్ సొంత పార్టీ వారి నుంచే వస్తున్నాయి. రాజకీయ వార్తల సంగతి పక్కకు పెడితే.. ఇప్పుడు సాక్షి మీడియాలో ప్రకటన స్కామ్ ఒకటి భారీ స్థాయిలో బయటపడిందని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు, ఇతర నేతలు ఇచ్చిన ప్రకటనలకు చెందిన సొమ్ము చాలావరకూ సిబ్బంది జేబుల్లోకి వెళ్లిపోయిందట.
ఇప్పుడు ఈ విషయం వెలుగుచూడటంతో తెలంగాణలోని రెండు, మూడు జిల్లాల మేనేజర్లకు ఉద్వాసన పలికారట. ఇంకా ఈ స్కామ్ మీద విచారణ జరుగుతోందట. పత్రికను నిలబెట్టాల్సిన సిబ్బందే ఇలా స్కాములకు తెగబడటం పర్యవేక్షణ లోపంగానే చెబుతున్నాయి మీడియా వర్గాలు.
ఈ స్కామ్ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయో.. ఇంకా ఎన్ని వికెట్లు పడతాయో అన్న ఆందోళన సిబ్బందిలో కనిపిస్తోంది. అసలే ఎన్నికలు ముందున్న సమయంలో ఇలాంటి స్కాములు మిగిలిన ఉద్యోగులపైనా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని సాక్షి యాజమాన్యం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.