ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొందరు శాసన సభ్యులపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉంది. ఉభయ నాయకత్వాలు అలాంటి విషయాల్లో ఉదాసీనంగా మొహమాటంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలను మొగ్గలో త్రుంచివేయటం ధర్మం. అలా కాకపోతే, సమయం, సందర్భం చూసి, ఋజువులు చూపి సాగనంపటం న్యాయం. మరీ మొహమాటానికి పోతే ఇంక పార్టీ ప్రభుత్వ మనుగడ కష్టం అలాటి సందర్భంలో చట్టప్రయోగంచాలు అన్నీ చక్కబడతాయి.
ఉదాహరణకు దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ను ఎమార్వో వనజాక్షికేసులో బుక్ చేసి చట్టబద్దంగా చర్య లు తీసుకొని ఉంటే ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు తిప్పలు తప్పి ఉండేవి. ఆయన పట్ల ఉన్న కులాభిమానమో మరింకేదో గాని చింతమనేని పై ఎలాంటి చర్యలు లేకపోవటం తో బోండా ఉమ, దేవినేని ఉమ, పెందుర్తి శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తి, అనంతపూర్ శాసనసభ్యుడు గునుగుంట్ల సూర్య నారాయణ ఇంకా మంత్రి అచ్చెన్నాయుడు ఇలా చెప్పు కుంటూ పోతే సంఖ్య చాంతాడంత.
ఎక్కడైనా మొహమాటాలకు అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అలా ఉంటే మాత్రం, ఇప్పుడు తెలంగాణాలో ఎన్నికలకు ముందున్న దృశ్యం పునఃరాగమనం కాక తప్పదు. అక్కడ మొహమాటాలకు తలవంచిన అధికారపార్టీ, టీఆరెస్ అప్పుడు ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అనే డోలాయమానస్థితిలో కొట్టుమిట్టాడిన పరిస్థితులుండేవి.
మొహమాటంతో కెసీఆర్ నాయకత్వంలోని ప్రస్తుత శాసనసభ్యులకు, మంత్రులపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉంది. మరి ఈ విషయం తెలియనట్టు నటించిన అధినేత వారందరికీ ఏవో కారణాలతో, మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఏవో కారణాలు చెప్పి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనుమాత్రం కేసీఆర్ పరిగణనలోకి తీసుకోకుండా టిక్కెట్లు ఇచ్చేశారు. అదే ధోరణితో ముందుకు వెళ్లారు. కానీ ప్రస్తుత శాసనసభ్యులు అధిక మంది ఘనవిజయమే సాధించారు. దానికి కారణం ఎన్నికల ముందు ఏపి ముఖ్య మంత్రి, టిడిపి అధినేత కాంగ్రెస్ తో చేతులు కలిపి పొత్తు పెట్టుకోవటాన్ని తెలంగాణా ప్రజలు తమపై ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం దాడి చేయటంగా భావించి ప్రస్తుతానికి ప్రస్తుత శాసన సభ్యులపై ఉన్న వ్యతిరేఖతను పక్కన పెట్టేసి ఓట్లు మూకుమ్మడిగా గుద్దేసిన దెబ్బకు వీళ్ళు బ్రతుకు జీవుడా! అంటూ బ్రతికి పోయారు ఎన్నికల్లో గెలిచి.
అంత ప్రభంజనంలోను తెలంగాణా ప్రజలు నలుగురు తెలంగాణా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అజ్మీరా చందూలాల్, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు ధారుణ ఓటమిని రుచి చూసేలా చేశారు. ఇవన్నీ కేసీఆర్ కు తెలిసినా మొహ మాటం కొద్దీ, వారికి అవకాశం ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఎంత బలంగా గాలి వీచినా, వీరు మాత్రం గెలవలేదు. అది వారి నమ్మి పదవులిస్తే వారి నడవడికతో, స్వయంకృతాపరాధం తోనే ఓటమి పాలయ్యారని అన్న అభిప్రాయం పార్టీసభ్యులు, కార్యకర్తల్లో విన్పిస్తున్నమాట.
బలంగా వీచిన తెలంగాణా రాష్ట్ర సమితి అనుకూల పవనాలు సైతం వారిని కాపాడలేదు. అలాంటి స్థితిలో తెలంగాణా ఎన్నిక ల్లో టిఆరెస్ గెలుపోటములను పరిస్థితు లను - మరో నాలుగు నెలల్లోనే ఏపీలో జరగనున్న ఎన్నికలతో బేరీజు వేయాలసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ఆయన సహా ఆ పార్టీ నాయకులంతా కోరుకుంటున్నారు. అయితే, ఇక్కడ కూడా తెలంగాణాను మించిన మొహమాటపు రాజకీయాలు ఉనికిలో ఉన్నాయి. గతంలో 2014లో మొహమాటానికి పోయి, అద్దంకి, తుని వంటి కీలకమైన నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు చాలా పొరపాట్లు చేశారు. దీంతో గెలుస్తామనుకొన్నచోట్ల సీట్లు వైసీపీ ఖాతాలోకి చేరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ మొహమాటపు రాజకీయాలు తగ్గకపోగా పదింతలుగా పెరిగిపోయాయి.
అంతేకాదు శాసనసభ ఎన్నికలకు టిక్కెట్లు మా కుమారునికో, కూతురుకో, తమ్ముడికో ఇవ్వమనే డిమాండ్ పెరిగిపోయింది. ఇక, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్న చింతమనేని ప్రభాకర్, బోండా ఉమ, దేవినేని ఉమ బండారు సత్యనారాయణ మూర్తి, గునుగుంట్ల సూర్య నారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, ఆదినారాయణ రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన కొందరు నాయకులు చాలామంది ఉన్నారు. తాజా పరిస్థితుల్లో వీదందరిని పక్కన పెట్టాల్సిన అవసరం తీవ్రగా ఉంది. అదే సమయంలో పదవీ, కుల, ధన, మదంతో, దురహంకారంతో విర్రవీగే ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు.
అయితే, వీరంతా ముఖ్యమంత్రి టిడిపి అధిన్రేత నారా చంద్రబాబు నాయుడు వద్ద మాత్రం అతివినయం ప్రదర్శిస్తున్నారు. వీరిపై, ప్రజల్లో నిద్రాణంగా, నిశ్శబ్ద వ్యతిరేకత ఉంది. ఇలాంటి వారిని అతివేగంగా తొలగించాలసిన అవసరం ఉంది. ఇప్పటికే అధినేత సర్వేల ఆధారంగా వారిని వ్యక్తిగతంగా హెచ్చరిస్తున్నా వారు ఆయన మాటల్ని లక్ష్యపెట్టిన సందర్భం కనిపించట్లేదు.
తాజాగా జరుగుతున్న సర్వేల పలితాలకు - క్షేత్రస్థాయిలో ఉనికిలో ఉన్న రాజకీయ పరిస్థితులకు పొంతన ఏమాత్రమూలేదు. తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులు దాదాపు పదిమంది దాకా ఉన్నారు. వీరిలో దేవినేని ఉమా ప్రప్రధముడు. ఈయన మీద ఏకంగా పార్టీలోనే అంతర్గతంగా తిరుగుబాటుఉంది. మరి ఇలాంటి నాయకులను చంద్రబాబు ఏ కులాభిమానం తో, మొహమాటంతోనో, ముందుకుపోతే అధికారం శంకరగిరి మాన్యాలు పట్టటం తధ్యం. టిడిపిలో చిరకాలం నుండీ సేవలు అందిస్తు వస్తున్న వర్గాలకు, యువతకు, పెద్దపీటవేయడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకుల విశ్లేషకుల అభిప్రాయం.
తెలంగాణా ఎన్నికల జయాపజయాల నుండి గుణపాఠాలు - టిడిపి నాయకత్వం నేర్చుకోవాలని అభిమానుల కోరిక. మరి ఒంటెద్దు పోకడలతో ముందుకుపోతున్న చంద్ర బాబు తెలంగాణాలో నేర్చుకున్న గుణపాఠం ఏమిటో? ఎలాంటిదో? మనకు తెలియాలంటే ఆయన ఏపి ఎన్నికలలో తీసుకునే నిర్ణయంకోసం మనం నిరీక్షించటం తప్ప వేరే మార్గం లేదు.....అంతవరకు.....లెట్ అజ్ వెయిట్.