వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మ వారు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీకి ఆ తమ్ముళ్ళు తయారయ్యారట. వాళ్ళను ఉంచలేక మార్చలేక హై కమాండ్ నానా హైరానా పడుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో ఉంచుకుని ఏంచేయాలో తెలియక తికమక పడుతోంది.
మారిస్తే తంటా:
సిట్టింగుల పని తీరుపై పలుమార్లు సర్వేలు చేయించిన చంద్రబాబు వారిని మార్చాలని గతంలో నిర్ణయించుకున్నారట. అయితే తాజాగా తెలంగాణా ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత సిట్టింగులకు సీటు ఇస్తే గెలుస్తారన్న నమ్మకం వచ్చిందట. అయితే మరీ పనితీరు అద్వాన్నంగా ఉన్న ఎమ్మెల్యేల విషయమే ఇపుడు అధినాయకత్వాన్ని కంగారు పెడుతోందని అంటున్నారు. ఈ విషయంలో వారిని తప్పిస్తే జరబోయే పరిణామాలను కూడా అధ్యయనం చేస్తోందట.
రెండు ఫార్ములాలు :
ఇపుడు టీడీపీ హై కమాండ్ ముందు రెండు ఫార్ములాలు ఉన్నాయంటున్నారు. ఒకటి తెలంగాణా ఫార్ములా, రెండవది కర్నాటక ఫార్ములా. తెలంగాణా ఫార్ములా ప్రకారమైతే మొత్తం సిట్టింగులకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవడం. కర్నాటక ఫార్ములా అయితే పనితీరు బాలేని వారిని పక్కన పెట్టడం. అలాగని పెద్ద ఎత్తున మార్పులు చేస్తే అసలుకే ఎసరు వస్తుందని తలుస్తున్న టీడీపీ పెద్దలు మధ్యే మార్గంగా తక్కువ మందిని తప్పించాలనుకుంటున్నారు.
వారు ఎవరన్నదే ఇపుడు టీడీపీలో హాట్ హాట్ చర్చగా ఉంది. టీడీపీ మూడు కేటగిరీలను ఇపుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో హై కమాండ్ పెట్టుకుందట. అందులో వెరీ పూర్ కేటగిరీలో పాతిక మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి టికెట్లు దక్కవన్న ప్రచారం సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.