గడిచిన 24 గంటల్లో రాష్ట్రాన్ని పెథాయ్ తుఫాను గడగడలాడించింది. భారీ ఎత్తున వర్షాలు కుమ్మేశాయి. అయితే, ఇవేవీ కూడా టీడీపీ నేతలను పెద్దగా ఒణికించలేదు. కానీ, 24 గంటల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్నట్టుగా వచ్చిన ఓ వార్త మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మె ల్యేలను గడగడలాచింది. ఒక్క ఉదుటున ఒణికిపోయారు. మా పరిస్థితి ఏంటి అని చర్చించుకుంటున్నారు. తుఫాన్ పెథాయ్ తీరం దాటినా.. ఏపీ టీడీపీ నేతల్లో ఏర్పడిన అలజడి తుఫాన్ మాత్రం మరో రెండు నెలల వరకు తీరం దాటేలా కనిపించడంలేదని అంటున్నారు పరిశీలకులు. దీంతో అసలు ఏం జరిగింది? ఎందుకంతగా టీడీపీ ఎమ్మెల్యేలు ఒణికి పోతున్నారు? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు వెయ్యి ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన గత కొన్నాళ్లుగా అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం పనిచేస్తుందని భావించిన ఆయన దానికి అనుకూలంగా తన రాజకీయాలను మార్చుకున్నారు. అదేసమ యంలో సంక్షేమ పథకాలను కూడా విరివిగా అమలు చేస్తున్నారు. అదేసమయంలో ఇటీవల ముగిసిన తెలంగాణా ఎన్నికలు, వచ్చిన రిజల్ట్, విజయం సాధించిన టీఆర్ ఎస్ అనుసరించిన వ్యూహాలను కూడా చాలా నిశితంగా పరిశీలించిన చంద్రబాబు అక్కడ అధికార పార్టీ అనుసరించిన వ్యూహాలను ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న ఎమ్మెల్లేల్లో పనితీరు సరిగాలేని, ప్రజల్లో ఒకింత పేరు లేని వారికి ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ విషయం చాలా రోజులుగా హల్చల్ చేస్తున్నా.. ఇప్పుడు మాత్రం దీనిపై పూర్తిక్లారిటీ వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో దాదాపు పాతిక మంది టీడీపీ సిట్టింగులకు చెక్ పెట్టాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నట్టు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఈ విషయంతో ఒక్కసారిగా టీడీపీ ఎమ్మెల్యేల్లో అలజడి ప్రారంభమైంది. ప్రజల్లో ఉండని వారు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లని నాయకులు, ప్రభుత్వంతో సంబందం లేకుండా వారి పనులు వారు చేసుకునే వారిని కూడా చంద్రబాబు పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ``వారు పార్టీకి పనికి వచ్చేవారై ఉండాలి. వారికి పార్టీ ఓ టూల్గా మారడం కాదు``-అనే సూత్రాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఈ పాతిక మందిలో మారు ఉంటుందా? అని తెగ ఆలోచనలో పడిపోయినట్టు సమాచారం., ఇదే విషయాన్ని.. జిల్లా పార్టీ అధ్యక్షులతోనూ పంచుకుంటున్నారని తెలిసింది. మరి ఆ పాతిక మంది ఎవరనేది తెలియాలంటే ఒకింత వెయిట్ చేయకతప్పదు..!