తెలంగాణలో వరుసగా రెండో సారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి మంత్రి వర్గ విస్తరణలో సామాజిక సమీకరణలతో పాటు అనేక ఈక్వేషన్లతో కేబినెట్ కూర్పు చేసిన కేసీఆర్ ఆ సారి మాత్రం పూర్తిగా తనకు అత్యంత విధేయులుగా ఉన్నవారినే కేబినెట్లోకి ఎంపిక చెయ్యనున్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ సమీకరణలతో పాటు భవిష్యత్తులో తన కుమారుడు కేటీఆర్ సీఎం అయితే తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేబినెట్ కూర్పు ఉంటుందని తెలుస్తోంది. తొలి విడతలో కేవలం 8 మంది మంత్రులతో మాత్రమే కేబినెట్ ఉంటుందని వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ ప్రక్షాళణ జరుగుతుందని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ 8మంది మంత్రులతో పాటు స్పీకర్, డిఫ్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీప్ విప్ పదవులకు కూడా ఎంపికలు ఉంటాయి. ఓవర్ ఆల్గా చూస్తే మొత్తం 11 మందితో కేసీఆర్ కేబినెట్ ప్రకటన ఉండనుంది. ఇప్పటికే కేసీఆర్ తనయుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏర్పడే కేబినెట్ టీం భవిష్యత్తులో కేటీఆర్ టీంగా ఉంటుందని కూడా సమాచారం. తొలి విడతలో ఉండే 8 మంది మంత్రుల్లో కేసీఆర్ కుటుంబం నుంచే కేటీఆర్, హరీష్రావు ఇద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చెయ్యడం కన్ఫామ్. ఇక తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్ అత్యధిక ప్రయార్టి ఇస్తున్న నేపథ్యం, మొన్న ఎన్నికల్లో ఈ సామాజికవర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపిక అవ్వడంతో రెడ్డి కోటాలో రెండు సీట్లు భర్తీ చేస్తారు.
గత కేబినెట్లో హోమ్ మంత్రిగా ఉన్న నాయిని నరసింహారెడ్డిని ఈ సారి రాజ్యసభకు పంపేయడం ఖాయమే. ఆయన స్థానంలో వనపర్తిలో గెలిచిన శింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేరు కేబినెట్ రేసులో వినిపిస్తోంది. ఇక రెడ్డి సామాజికవర్గం నుంచి కేబినెట్ భర్తీ కేసీఆర్కు కత్తి మీద సామే. ఎందుకంటే ఈ సామాజికవర్గం నుంచే ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. ఇదే సామాజికవర్గం నుంచి గత కేబినెట్లో పని చేసిన జగదీష్రెడ్డి, లక్ష్మారెడ్డికి కూడా తొలి విడతలో చోటు లభిస్తుందన్న టాక్ ఉంది. జగదీష్రెడ్డి, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డిలలో తొలి విడతలో ఎవరికి చోటు దక్కుతుందో కాస్త సస్పెన్స్. ఇక బీసీ వర్గం నుంచి ఈటెల రాజేందర్తో పాటు, గ్రేటర్లో కీలక నేతగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్కు స్థానం లభిస్తుందని భావిస్తున్నారు. ఎస్టీ వర్గం నుంచి డోర్నకల్ నియోజకవర్గం నుంచి గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్కు ఛాన్స్ దక్కనుంది.
ఇక బీసీ లేదా మున్నూరు కాపు కోటాలో తాజా మాజీ కేబినెట్ సభ్యడు పద్మారావు గౌడ్తో పాటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక గతంలో డిఫ్యూటి స్పీకర్గా పని చేసిన పద్మాదేవేందర్ రెడ్డికి మహిళా కోటాలో మంత్రి వర్గంలో తొలి విడతలో చోటు దక్కుతుందా ? లేదా అన్నది ఉత్కంఠే. ఆమెను స్పీకర్గా నియమించే చాన్సులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఈ సారి కూడా కేసీఆర్ కేబినెట్లో మహిళలకు చోటు లేనట్టే. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్గా ఎంపిక చేస్తే పద్మాదేవేందర్ రెడ్డిని డిఫ్యూటి స్పీకర్గా ఎంపిక చెయ్యవచ్చని మరో టాక్ కూడా ఉంది. మరి ఇదే జరిగితే ఎస్సీ కోటాలో తొలి విడతలో ఎవరికి చాన్స్ దక్కుతుందో చూడాల్సి ఉంది. ఇక తొలి విడతలో మినీ కేబినెట్ కూర్పు తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ భర్తీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.